సైబర్ క్రైమ్లు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి.అమాయక ప్రజలను మోసగించడానికి, వారు కష్టపడి సంపాదించిన డబ్బును దొంగిలించడానికి స్కామర్లు కొత్త మార్గాలను కనుగొంటున్నారు.
మెసేజ్లు పంపి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.అందులోని లింక్పై క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సైబర్ నేరగాళ్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేరుతో ప్రజలను మోసగిస్తున్నారు.ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో ఎస్బీఐ ఖాతాదారులకు మెసేజ్లు వస్తున్నాయి.
SBI Yono ఖాతాను అప్డేట్ చేయడానికి, మళ్లీ యాక్టివేట్ చేయడానికి వారి పాన్ కార్డ్ వివరాలను అప్డేట్ చేయమని ఖాతాదారులను స్కామర్లు అడుగుతున్నారు.దీనిపై ఎస్బీఐ అప్రమత్తం అయింది.
ఖాతాదారులకు పలు సూచనలు చేసింది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
చాలా మంది ఎస్బీఐ ఖాతాదారులకు వారి YONO యాప్ డీయాక్టివేట్ చేయబడిందని, ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయడానికి వారి పాన్ నంబరును తప్పనిసరిగా అప్డేట్ చేయాలని పేర్కొంటూ మెసేజ్లు వస్తున్నాయి.వాటిలో కింద భాగంలో ఓ లింక్ కూడా ఉంటోంది.దాన్ని క్లిక్ చేయడం ద్వారా యూజర్ల వ్యక్తిగత వివరాలకు హ్యాకర్లకు యాక్సెస్ లభిస్తుంది.“ప్రియమైన కస్టమర్, మీ SBI YONO ఖాతా ఈరోజు నిలిపివేయబడింది.పునరుద్ధరించడానికి ఇప్పుడే సంప్రదించండి.క్రింది లింక్లో మీ PAN నంబర్ను అప్డేట్ చేయండి” అని సందేశం ఉంటోంది.తాము ఎప్పుడూ ఇలా మెసేజ్లు పంపి అప్డేట్ చేయమని అడగమని ఎస్బీఐ తెలిపింది.

ఖాతాదారులు అలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది.ఎస్బీఐ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు అది నిజమో కాదో పరిశీలించుకోవాలని సూచించింది.ఎస్బీఐ పేరిట వచ్చే మెసేజ్ నకిలీదని అనుమానం వస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలని పేర్కొంది.
లేని పక్షంలో [email protected]కి ఇ-మెయిల్ పంపవచ్చని, హెల్ప్లైన్ నంబర్ – 1930కి కాల్ చేయవచ్చని తెలిపింది.







