విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మళ్ళీ లైన్ లోకి వచ్చారు.2014లో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగాను బాధ్యతలు చేపట్టారు.ఇక 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరేందుకు గట్టి ప్రయత్నాలు చేసినా, అవి వర్కౌట్ కాలేదు.దీంతో టిడిపి నుంచే మళ్లీ పోటీ చేశారు.2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కాలం పాటు ఆ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గంటా చేరికను అడ్డుకోవడం తదితర కారణాలతో ఆయన సైలెంట్ అయిపోయారు.టిడిపిలోనూ యాక్టివ్ గా లేరు.
పార్టీ తరఫున ఏ కార్యక్రమంలోనూ గంటా యాక్టివ్ గా కనిపించడం లేదు.దీంతో 2024 ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీలో గంటా శ్రీనివాసరావు చేరుతారని, అయితే జనసేన లేదా బిజెపిలోకి ఆయన వెళ్లే అవకాశం ఉంది అని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఆకస్మాత్తుగా మెగాస్టార్ చిరంజీవితో గంటా ప్రత్యేకంగా భేటీ అయ్యారు.గతంలోనూ అనేకసార్లు ఆయన భేటీ అయినా పెద్దగా హైలెట్ అయినట్టు కనిపించలేదు.
చాలా కాలంగా చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతున్నా, తాను పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యానట్లు చిరంజీవి ప్రకటించారు .అయితే ఇటీవల తన సోదరుడిని ఉద్దేశించి చిరంజీవి వ్యాఖ్యలు ఎప్పటికైనా పవన్ సీఎం అవుతారని, పవన్ కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చిరంజీవి వ్యాఖ్యానించారు.దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారాయి.

ఇప్పటివరకు జనసేనకు చిరంజీవి మద్దతు లేదని , ఆయన వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతూ వచ్చింది.కానీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో చిరంజీవి ఆ వ్యాఖ్యలు చేయడం జనసేనకు ముంచి ఉత్సాహాన్ని ఇచ్చింది.గంటా చిరంజీవితో భేటీ కావడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి చిరంజీవిని తీసుకువచ్చేందుకు గంటా ప్రయత్నిస్తున్నారని, దానిలో భాగంగానే చిరంజీవితో మంతనాలు చేసేందుకు , ఆయన ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.







