మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల విషయమై టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్త టెన్షన్ పడుతున్నట్టుగానే కనిపిస్తున్నారు.మొదట్లో ఉన్నంత సానుకూలత ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కనిపించడం లేదు.
బిజెపి, కాంగ్రెస్ పోటాపోటీగా ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడం , ప్రభుత్వ నిర్ణయాలను, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను హైలైట్ చేస్తూ తమను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తు ఉండడం, ప్రజల్లోనూ టిఆర్ఎస్ పై కాస్త వ్యతిరేకత కనిపిస్తున్న అంశం పైన కెసిఆర్ చాలా సీరియస్ గానే దృష్టి పెట్టారు .ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారానే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందనే విషయాన్ని కేసిఆర్ బలంగా నమ్ముతున్నారు.ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులకు పదే పదే చెబుతున్నారు.కచ్చితంగా టిఆర్ఎస్ విజయం సాధించే విధంగా 86 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ నియోజకవర్గానికి ఇన్చార్జీలుగా నియమించారు.
తమకు కేటాయించిన గ్రామాలకు కనీసం 20 మంది అనుచరులతో వెళ్లాలని కెసిఆర్ ఆదేశించారు.అయినా ఈ ఉప టిఆర్ఎస్ గెలుపు పై కెసిఆర్ కు అనుమానాలు ఉన్నాయి.
అందుకే ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావును రంగంలోకి దించాలని కేసీఆర్ నిర్ణయించారు.దీంతో ఈ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత బరువు హరీష్ రావు పడింది.
మొదటి నుంచి టిఆర్ఎస్ లో హరీష్ రావుకు మంచి ప్రాధాన్యం ఉండేది.ట్రబుల్ షూటర్ గా పార్టీ కష్ట సమయంలో ఆయన చురుగ్గా వ్యవహరిస్తూ, పార్టీకి మేలు జరిగే విధంగా వ్యవహరించేవారు .అయితే ఇటీవల కాలంలో కేసీఆర్ కు హరీష్ కు మధ్య దూరం పెరిగిందని, ఈటెల రాజేందర్ ను తప్పించినట్లుగానే హరీష్ రావును తప్పిస్తారని హడావుడి నడిచింది .

చాలాకాలం మంత్రి పదవికి హరీష్ రావును దూరం పెట్టారు.అయితే తెలంగాణలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు బలపడుతూ ఉండడం, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ బిజీ కావడం తదితర కారణాలతో హరీష్ కు మరింత ప్రాధాన్యం పెంచుతూ వస్తున్నారు.ఇప్పుడు మునుగోడు భారం కూడా ఆయన పైనే వేశారు.
ఈ ఎన్నికల ఫలితాలు సానుకూలంగా వస్తే హరీష్ రావుకు మరింత ప్రాధాన్యం పెరుగుతుంది.ఫలితం కనుక తేడా కొడితే ఆ ఓటమి బాధ్యతలు, దాని పర్యవసనాలను స్వీకరించేందుకు హరీష్ సిద్ధం కావాల్సిందే.







