యాదాద్రి జిల్లా:దసరా పండుగ సందర్భంగా పెండింగ్ బోనస్,జీతం ఇవ్వాలని,ప్రతిష్ఠ యాజమాన్యం మొండి వైఖరి నశించాలని,కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామంలోని ప్రతిష్ఠ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్మికులు ప్రతిష్ఠ స్టాప్ మరియు వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
నూతన వేతన ఒప్పందం కోరుతూ గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నా కంపెనీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో 13వ రోజు ఎస్.లింగోటం నుండి చౌటుప్పల్ ఆర్డీవో ఆఫీస్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేశం,సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం ముఖ్యాతిథులుగా హాజరై సంఘీభావం తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ గత 11 నెలలుగా కార్మికులకు వేతన ఒప్పందం చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న ప్రతిష్ఠ యాజమాన్యం కార్మిక సంఘం నాయకులతో చర్చలు జరిపి వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల కార్మిక ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.12 రోజుల సమ్మె వల్ల 68 కోట్ల మేరకు నష్ఠం వచ్చిందని లే-ఆఫ్ చేస్తున్నామని ప్రకటించడం చట్ట విరుద్ధమన్నారు.తక్షణమే లే-ఆఫ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నామని చెప్తున్న యాజమాన్యం,సంవత్సరానికి కార్మికుల సంక్షేమం కోసం కేవలం 60 లక్షల రూపాయలు భరించలేదా అని ప్రశ్నించారు.
సమాజం మొత్తం ప్రతిష్ఠ యాజమాన్యం మొండి వైఖరిని ఖండిస్తుందని, కార్మికుల సమ్మె పోరాటానికి రోజు రోజుకు మద్దత్తు పెరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రతిష్ఠ స్టాప్ మరియు వర్కర్స్ యూనియన్ (సిఐటియు)అద్యక్ష,కార్యదర్శులు ఎండి పాషా, యూనియన్ నాయకులు దూసరి వెంకటేశం,సత్యం, పల్సం వెంకటేశం,సత్యనారాయణ,బుచ్చమ్మ,లలిత, పార్వతమ్మ,రవిందర్ రెడ్డి,సతీష్,లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.