ఏపీ అధికార పార్టీ వైసీపీ లో సీనియర్ నాయకుల వ్యవహారం చర్చినియాంశంగా మారింది.దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ తమకు తిరిగే లేదన్నట్లుగా నియోజకవర్గాల్లో చక్రం తిప్పిన నేతలు ఎంతోమంది ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు వీరిలో కొంతమందికి మంత్రి పదవులు దక్కినా, చాలామందికి పదవులు దక్కలేదు.
దీంతో కొంత అసంతృప్తికి గురైనా, మెల్లిమెల్లిగా ఆ అసంతృప్తిని మరిచిపోతూ వస్తున్నారు.అయితే ఎందుకో తెలియదు కానీ పార్టీ సీనియర్ నాయకులు చాలామంది చురుగ్గా ఉండడం లేదు.
వైసిపి ప్రభుత్వం పైన జగన్ కుటుంబం పైన రాజకీయ ప్రత్యర్థులు ఎంతగా విమర్శలు చేసినా,నోరు మెదిపేందుకు చాలామంది సీనియర్ నాయకులు ఇష్టపడడం లేదు.ఇప్పటికే అనేక పార్టీలు మారి వచ్చిన వారు, గతంలో మంత్రులుగా పని చేసిన వారు ఎంతోమంది ఉన్నా వైసిపిలో వారంతా సైలెంట్ గానే ఉండిపోతున్నారు. వీరిలో జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు ఎంతోమంది ఉన్నారు.వీరంతా 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతోపాటు, ఇదే విషయాన్ని జగన్ వద్ద ప్రస్తావించగా, జగన్ మాత్రం మళ్లీ మీరు పోటీ చేయాల్సిందేనంటూ చెప్పేస్తున్నారు.
తాము పొలిటికల్ గా సైలెంట్ అయినా , ఎన్నికలకు దూరంగా ఉన్న వారసులకు టికెట్ ఇవ్వాల్సిందిగా జగన్ వద్ద ప్రస్తావిస్తున్నా,జగన్ మాత్రం వారసుల కంటే మీరే పోటీ చేయాలని, వారసుల సంగతి తర్వాత చూద్దామని చెబుతున్నారు.ఒకవేళ వారసులకు టికెట్ దక్కినా, దక్కకపోయినా తాము మాత్రం పోటీకి దూరంగా ఉంటే మంచిది అన్న అభిప్రాయంతో ఉన్నారట.
వైసీపీలో యువనాయకత్వం ఎక్కువగా ఉంది.వారికి జగన్ బాగానే ప్రాధాన్యం ఇస్తున్నారు.
వారితో సన్నిహితంగా మెలుగుతున్నారు కానీ సీనియర్ నాయకులు జగన్ తో ఆ స్థాయిలో సన్నిహితంగా ఉండలేకపోవడం, జగన్ సైతం వారిని పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తుండడంతో సీనియర్ నాయకులు ఈ నిర్ణయం తీసుకుంటున్నారట.

ఇక జగన్ కు అత్యంత సన్నిహితుడుగా పేరుపొందిన మాజీ మంత్రి పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తికి టిక్కెట్ ఇవ్వాలని కోరారట.జగన్ మాత్రం ఆ ప్రతిపాదనకు తిరస్కరించారట.అలాగే ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, బొత్స సత్యనారాయణ , ధర్మాన ప్రసాదరావు తో పాటు చాలామంది తమ వారసులకు టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్న, జగన్ మాత్రం ఈ సీనియర్ నాయకులని మళ్ళీ పోటీ చేయాలని సూచిస్తున్నారట.
అయితే వైసిపి అధికారంలోకి వచ్చేందుకు తాము ఎంతగానో కృషి చేసినా జగన్ రాజకీయ అనుభవం తమ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని పదవులు ఇచ్చే విషయంలో ప్రాధాన్యం కల్పించకుండా తమ స్థాయిని తగ్గించారనే అసంతృప్తితో చాలామంది ఉండడంతోనే వైసీపీతోనే కాదు రాజకీయాలకు దూరంగా ఉండి తమ వారసులను తెరపైకి తీసుకొస్తున్నారట.







