లిక్కర్ మాఫియా ఆగడాలు పెరగడమే తప్పా.ఎక్కడా తగ్గిన దాఖలాలు కనిపించడం లేదు.
ఈ చోట, ఆ చోట అనే తేడా లేదు.ప్రతి ప్రాంతంలోనూ లిక్కర్ మాఫియా హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు.
బిహార్ లో అయితే ఏకంగా స్కూలునే వారి గోదాముగా మార్చేశారు.ఓ గదికి స్కూల్ సిబ్బంది వేసిన తాళాన్ని పగులగొట్టి.
కేసుల కొద్దీ విదేశీ మద్యాన్ని ఆ గదిలో నిల్వ చేశారు.తర్వాత వారు తెచ్చుకున్న తాళాన్ని దానికి వేసి దర్జాగా వెళ్లిపోయారు.
అది బిహార్ వైశాలి జిల్లా లాల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ గ్రామంలోని ఓ ఉన్నత పాఠశాల.ఈ ఉన్నత పాఠశాలనే గోదాముగా మార్చింది ఓ లిక్కర్ మాఫియా.
అందుకోసం ఓ గదికి పాఠశాల సిబ్బంది వేసిన తాళాన్ని పగుల గొట్టి తమ కొత్త తాళాన్ని వేశారు స్మగ్లర్లు.అయితే హైస్కూల్ ఉపాధ్యాయుడు ఆదేశ్ పాల్.బుధవారం ఉదయం స్కూల్ కు వచ్చాక ఆ గదిని తెరవడానికి వెళ్లగా.కొత్త తాళం ఉండటాన్ని గమనించారు.
వెంటనే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడికి సమాచారం అందించారు.అనంతరం లాల్ గంజ్ పోలీసులకు విషయాన్ని తెలిపారు.
పాఠశాల సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పాఠశాలకు వచ్చిన పోలీసులు.తాళం పగులగొట్టి చూడగా.గదిలో భారీగా మద్యం నిల్వలు ఉన్నాయి.140 బాక్సుల విదేశీ మద్యం సీసాలను పోలీసులు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.