యాదాద్రి జిల్లా:కరెన్సీ నోట్లపై డాక్టర్ బీ.ఆర్.
అంబేద్కర్ ఫోటో పెట్టాలని,పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని,సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని గత మూడు సంవత్సరాలుగా ప్రజా చైతన్య యాత్ర,జ్ఞాన యుద్ధ యాత్ర చేసి,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు,మంత్రులకు, ఎమ్మెల్యేలకు,ఎమ్మెల్సీలకు,ఎంపీలకు,వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులను కలసి మెమోరండం ఇవ్వడం జరిగిందని,దాని ఫలితంగానే సీఎం కేసీఆర్ సచివాలయానికి అంబేద్కర్ పేరు నామకరణం చేయడం,పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందని,అది మా ఉద్యమ పోరాట ఫలితమేనని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరుశురామ్ తెలిపారు.గురువారం ఆయన భువనగిరి జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్,సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఈ అంశంపై పలుసార్లు కలసి చెప్పామని,సీఎంని ఢిల్లీలో కలిసి మాట్లాడడం జరిగిందని అన్నారు.
దాని ఫలితమే నూతన సచివాలయానికి అంబేద్కర్ పెట్టడమని,అంబేద్కర్ పేరు పెట్టినందుకు సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.అదేవిధంగా సచివాలయంలో ప్రధాన ముఖ ద్వారం వద్ద డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామని,ఈ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ సహచరులకు,ఆర్థిక సహాయం అందించి మమ్ము ముందుకు నడిపిన ప్రతి ఒక్కరికి జై భీములు తెలిపారు.







