టిడిపి అధినేత చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీసేందుకు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు.మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా చేసేందుకు రకరకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు.
రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ఈసారి టిడిపి నేతలతో పాటు, చంద్రబాబును ఎమ్మెల్యేగా ఓడించాలనే లక్ష్యాన్ని జగన్ నిర్దేశించుకున్నారు.ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు.
దీంతో ఆయన ఈ నియోజకవర్గంలోని టిడిపి కీలక నాయకులందరినీ వైసీపీలో చేర్చడంతో పాటు, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోను వైసీపీ జెండా ఎగిరేలా చేశారు.అక్కడితో సరిపెట్టకుండా మరింతగా నియోజకవర్గం భారీ ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. 2019 ఎన్నికల్లోను ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి జగన్ హాజరు కాలేదు. అయితే ఇప్పుడు మాత్రం కుప్పం నియోజకవర్గంలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈనెల 22వ తేదీన కుప్పంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ శంకుస్థాపన చేయబోతున్నారు.అలాగే వైఎస్సార్ చేయూత కార్యక్రమంలోనూ జగన్ పాల్గొంటారు.ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేగా చంద్రబాబు ఈ కార్యక్రమాలకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్ధి జగన్ హాజరయ్యే సమావేశానికి చంద్రబాబు దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా వైసీపీ, టిడిపి కార్యకర్తల మధ్య వివాదాలు తలెత్తాయి.

ఒకరిపై ఒకరు దాడులకు దిగడం, పోలీస్ కేసులు నమోదవడం వంటివి జరిగాయి.దీనిపై ఇంటిలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో జగన్ పర్యటనకు ముందే టీడీపీకి చెందిన కీలక నాయకులు అందరిని ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.ఇక జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికే అనేకసార్లు చంద్రబాబు పర్యటన కొనసాగింది.
అయితే ఇప్పటి వరకు కుప్పం వరకు అడుగుపెట్టని జగన్ ఈసారి మాత్రం చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయటమే లక్ష్యంగా ఈ నియోజకవర్గంలో పర్యటించబోతుండడంతో చంద్రబాబు ఆందోళన చెందుతున్నారట. ఇప్పటికే ఇక్కడ టిడిపికి అనుకూల పరిస్థితులు తగ్గిపోయాయని, ఇప్పుడు జగన్ పర్యటిస్తే మరింతగా పార్టీ నుంచి చేరుకలు వైసీపీలోకి ఉంటాయని ఆందోళన చెందుతున్నారట.
కుప్పంలో జగన్ పర్యటిస్తే చంద్రబాబు ఆధ్వర్యంలో పులివెందులలో మినీ మహానాడు నిర్వహించి తమ సత్తా చాటుతామని టిడిపి హెచ్చరికలు చేస్తోంది.దీంతో జగన్ కుప్పం పర్యటన అందరికీ ఆసక్తికరంగా మారింది.







