మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటుకోవాలని చూస్తున్న బీజేపీ కి ఇప్పుడు కొత్త ఇబ్బందులు వచ్చిపడ్డాయి.ఆ ఇబ్బందులు కూడా రాజకీయ ప్రత్యర్ధుల నుంచి వచ్చినవి కాదు.
సొంత పార్టీ నాయకుల నుంచి వస్తున్నవే.దీంతో సొంత నేతల గ్రూపు రాజకీయాలు ఎక్కడ తమ కొంప ముంచుతాయో అన్న బెంగ కమలనాథుల్లో మొదలయ్యింది.
ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే … మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఈ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున గెలవాలని పట్టుదలతో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.
దీనికి అనుగుణంగా ఆయన వ్యవహారాలు చేస్తున్నారు.గతంలో కాంగ్రెస్ లో ఉన్న పరిచయాలు , ఈ నియోజకవర్గ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ మళ్ళీ గెలిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
ఇక పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉండేలా రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.కాంగ్రెస్ లో తన వెంట నడిచిన కీలక అనుచరులకు బిజెపి కండువా కప్పుతూ తన ఇమేజ్ని మరింత పెంచుకునే ప్రయత్నాల్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.
అయితే కొత్తగా చేరుతున్న నాయకులతో ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బిజెపిలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయి.ముఖ్యంగా పాత కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవడం, రాజగోపాల్ రెడ్డి కొత్త నేతలను ప్రోత్సహిస్తూ తమను పట్టించుకోవడంలేదని బాధను పాత బిజెపి నేతలు చేస్తున్నారట .ఎక్కడ ఏ సమావేశాలు నిర్వహించినా, కొత్త పాత నేతలు వేరువేరుగా వస్తుండడం , ఆహ్వానాలు కూడా వేర్వేరు గానే ఉంటుండడంతో.ఉప ఎన్నికల్లో ఈ తరహా వ్యవహారాలు తమ ఫలితం ను దెబ్బతీస్తాయని రాజగోపాల్ రెడ్డి తో పాటు, బిజెపి అగ్ర నేతలు సైతం ఆందోళన చెందుతున్నరట.

ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఈ ఉప ఎన్నికలతో ముడిపడి ఉండడంతో , కొత్త పాత నేతలు మధ్య డబ్బు వ్యవహారం కూడా మరింత గ్యాప్ తీసుకొస్తోందట.దీంతో బిజెపి సీనియర్ నేతలు ఈ వ్యవహారాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో సమిష్టిగా పార్టీ విజయానికి అంతా కృషి చేయాల్సి ఉండగా, ఈ తరహా వ్యవహారాలు మంచిది కాదని, అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన సమయంలో ఈ గ్రూపు రాజకీయాలు చేటు తెస్తాయని హెచ్చరికలు చేస్తున్నారట.కొద్ది రోజుల క్రితం బిజెపిలో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ స్వయంగా హాజరయ్యారు.
బూత్ స్థాయి కార్యకర్తలు సమావేశం లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆ సమావేశంలో కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు తమ వాదనను వినిపిస్తుండడం వంటి వ్యవహారాలను స్వయంగా చూసిన సునీల్ బన్సల్ ఈ పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారట.
ముందు పార్టీ లోని పరిస్థితులను చక్కదిద్దుకోకుండా.జనాల్లోకి వెళ్లినా ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారట. ఇక గత రెండు ఎన్నికల్లోను బిజెపి నుంచి పోటీ చేసిన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి సైతం ఇక్కడ తనకు సరైన గుర్తింపు రావడంలేదని రాజగోపాల్ రెడ్డి అనుచరులకి పెద్దపీట వేస్తున్నారనే అసంతృప్తితో ఉన్నారట.







