గత కొంతకాలంగా దేశ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించేందుకు ప్రయత్నిస్తున్నారు టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బిజెపిలకు వ్యతిరేకంగా మూడో ప్రత్యామ్నాయ కూటమి తెర పైకి తెచ్చి అధికారం సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగానే బిజెపిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి వారి పైన వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ, గత కొంతకాలంగా వార్తల్లో ఉంటున్నారు.అయితే కేసీఆర్ విషయంలో సరైన సమయం కోసం ఎదురు చూస్తూ వస్తున్న బిజెపికి కెసిఆర్ కుమార్తె కవిత విషయంలో కొత్త అస్త్రం దొరికింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు బయటకు రావడంతో తెలంగాణలోని ప్రతిపక్షాలకు కేంద్రంలోని బిజెపికి కెసిఆర్ ను ఇరుకుని పెట్టేందుకు అవకాశం ఏర్పడింది. కేంద్రంలో బిజెపిపై పోరాటం ఉధృతం చేసిన సమయంలోనే కవిత వ్యవహారం కేసిఆర్ కు ఇబ్బందికరంగా మారింది.
దీంతో కవిత విషయంలో కెసిఆర్ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట.కవిత లిక్కర్ స్కాం విషయానికి వస్తే ఢిల్లీ బిజెపి ఎంపీ పర్వేస్ వర్మ, ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మంజింధం శిర్శ, వంటి వారు ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలు చేశారు.
కేసీఆర్ కుటుంబ సభ్యుల సూచనలతోని ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారని మద్యం విధానానికి సంబంధించిన చర్చల్లో కవిత కూడా పాల్గొన్నారు అని, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా, ఎక్సైజ్ అధికారులు కేసీఆర్ కుటుంబ సభ్యులు హోటల్ లో జరిగిన చర్చల్లో డీల్ కుదుర్చుకున్నారని, వారు ఆరోపణలు చేశారు.

అంతేకాదు తెలంగాణకు చెందిన మద్యం వ్యాపారి రామచంద్రన్ ను కవిత వెంట తీసుకువచ్చారని ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్ లో ఆరు నెలల పాటు కవిత కోసం ఒక గదిని కేటాయించారని, తెలంగాణలో అమలవుతున్న మద్యం విధానాన్ని కెసిఆర్ కుటుంబ సభ్యులు పంజాబ్ ఢిల్లీలలో అమలు చేయించారని వారు చెప్పుకొచ్చారు.లిక్కర్ మాఫియా కమీషన్ ను 10% పెంచేందుకు చేసుకున్న 150 కోట్ల రూపాయల డీల్ లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా సిసోడియాకు అందినట్లుగా వారు ఆరోపణలు చేశారు.అయితే ఈ వ్యవహారంపై కవిత కూడా ఘాటుగానే స్పందించారు.
తాను ఏ తప్పు చేయలేదని దీనిపై ఎటువంటి విచారణ జరిగినా, సహకరిస్తారనని, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ యాక్టివ్ కావడంతోనే ఈ విధమైన వేధింపులకు పాల్పడుతున్నారని , కేంద్రంలో బిజెపిపై పోరాటం చేసే విషయంలో వెనక్కి తగ్గేది లేదు అని ఆమె చెబుతున్నారు.అయితే ఈ వ్యవహారం ద్వారా కేసీఆర్ దూకుడు కు బ్రేక్ వేసేందుకు బిజెపికి మంచి ఛాన్స్ అయితే దొరికింది.







