తైవాన్ లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల వల్ల డ్రాగన్ కంట్రీ ఆ దేశంపై కన్నెర్ర చేసింది.అంతే కాదు ఆ దేశం చుట్టూ సైనిక విన్యాసాలను కొనసాగిస్తూ అక్కడి ప్రజలకు చెమటలు పట్టిస్తోంది.
ఈ ఉద్రిక్తతల నడుమ తైవాన్ రక్షణ శాఖ అధికారి మృతి చెందడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.ఒయు యాంగ్ లీ–సింగ్ తైవాన్ రక్షణ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి విభాగంలో ఒక ఉన్నత అధికారిగా వ్యవహరిస్తున్నారు.
అయితే నిన్న అంటే శనివారం ఉదయం దక్షిణ తైవాన్లోని ఓ హోటల్ గదిలో అతడు విగతజీవిగా కనిపించారు.
అసలు ఆయన అక్కడికి ఎందుకు వెళ్లారు? ఎలా చనిపోయారు? అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.అతని మరణానికి దారితీసిన కారణాలు ఏంటనేది కూడా ఇప్పటివరకు రక్షణశాఖ నిర్ధారించ లేకపోయింది.ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతోంది.ఒయు యాంగ్ ప్రస్తుతం నేషనల్ చుంగ్–షాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ హెడ్ గా వ్యవహరిస్తున్నారు.ఆయన దేశానికి చెందిన వివిధ క్షిపణి అభివృద్ధి ప్రాజెక్టులను దగ్గరుండి మరీ చూసుకుంటారు.
అయితే ఇలాంటి కీలకమైన వ్యక్తి అనుమానస్పద రీతిలో చనిపోవటంతో అది చైనా పనే అయి ఉంటుందని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఒయు యాంగ్ బిజినెస్ ట్రిప్లో ఉండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.చైనా దాడుల కారణంగానే ఒయు యాంగ్ చనిపోయాడని ప్రస్తుతం తైవాన్ అధికారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.ఈ ఆరోపణలపై చైనా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.