వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు దూకుడుగా ముందుకు వెళుతూ జనాల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఏపీ బీజేపీ ఇప్పుడు ఈ విషయంపై దృష్టి సారించింది.ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పాటు, తమ ప్రత్యర్థులంతా జనాల బాట పడుతుండడంతో తాము కూడా ప్రజా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించుకుంది.
ఈ మేరకు అమరావతి అంశాన్న హైలెట్ చేసేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.టిడిపి అధికారంలో ఉన్న సమయంలో అమరావతి విషయంలో కొంతకాలం సహకారం అందించినట్లే కనిపించినా, ఆ తర్వాత టిడిపి బిజెపి మధ్య విభేదాలు తలెత్తిన తర్వాత అమరావతి అంశాన్ని పూర్తిగా బిజెపి పక్కన పెట్టింది.
అంతేకాదు దీనిపై వైసీపీ కి మద్దతుగా అమరావతి అంశంపై విమర్శలు చేయడంతో పాటు, ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు తెలిపారు .ఈ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ బీజేపీ నేతలకు క్లాస్ పీకడం , అమరావతి వ్యవహారంలో వ్యతిరేకంగా వెళ్లవద్దంటూ పార్టీ నాయకులకు క్లాస్ ఇవ్వడం తో అప్పటి నుంచి అమరావతికి అనుకూలంగా బిజెపి నాయకులు ప్రకటనలు చేస్తున్నారు.ఈ మేరకు మనం మన అమరావతి పేరుతో బిజెపి ఇప్పుడు పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతోంది.అమరావతి మద్దతుగా పాదయాత్ర చేపడుతున్నట్లుగా బిజెపి ప్రకటన విడుదల చేసింది.బిజెపి గుంటూరు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో 29 నుంచి, వచ్చే నెల నాలుగో తేదీ వరకు రాజధాని గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించబోతున్నట్లు ఆ పార్టీ నేత పాడిబండ్ల రామకృష్ణ ప్రకటించారు./br>

రాజధాని గ్రామాల్లోని 75 కిలోమీటర్ల వరకు ఈ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు.ఈ నెల 29 తాడేపల్లి మండలం ఉండవల్లి లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది.మొదటి రోజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, వంటి వారు ఈ యాత్రలో పాల్గొంటారు.
నాలుగో తేదీన తుళ్లూరులో అమరావతి అంశంపై భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బిజెపి ఏర్పాట్లు చేసుకుంటుంది.అమరావతి విషయంలో టిడిపికి పూర్తిగా క్రెడిట్ రాకుండా ఇప్పుడు ఏపీ బీజేపీ రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తోంది.







