ఒకప్పుడు ఎవరికైనా ఏదైనా సమాచారం పంపాలంటే ఇప్పటిలా ఫోన్లు ఉండేవి కావు.దీంతో స్తోమత, అవసరం బట్టి పోస్టుకార్డు, రిజిస్టర్ పోస్టు, టెలిగ్రామ్ వంటివి పంపేవారు.
ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు.ఏం సమాచారం చేయాలన్నా వాట్సాప్లో టెక్స్ట్ చేసేస్తున్నారు.
ప్రస్తుతం కొరియర్ సంస్థలు కూడా అన్ని విషయాల్లో పోస్టల్ శాఖకు గట్టిపోటీ ఇస్తున్నాయి.ఈ పరిస్థితుల్లో పోస్టల్ శాఖ మనుగడ కష్టం అవుతూ వస్తోంది.
దీంతో పోస్టల్ శాఖ కూడా సాంప్రదాయ విధానాలతో పాటు కొత్త విధానాలకు శ్రీకారం చుడుతోంది.ఇందులో భాగంగానే బ్యాంకింగ్ సర్వీసులు ప్రారంభించింది.
పార్సిల్ సర్వీసులు కూడా చేపడుతోంది.తాజాగా ఓ సరికొత్త సర్వీసును అమలు చేస్తోంది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కర్నాటక పోస్టల్ విభాగం ఓ సరికొత్త సర్వీసును ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టింది.
అక్కడి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎస్ రాజేంద్రకుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఓ ప్రైవేట్ సంస్థతో కలిసి ఇడ్లీ పిండి, దోశ పిండి ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు.
మొదటగా బెంగళూరులోని కొన్ని ఇళ్లకు పిండి సరఫరా చేస్తున్నారు.ప్రస్తుతానికి ఆర్డర్లు బాగానే సాగుతున్నాయని రాజేంద్ర కుమార్ వివరించారు.ప్రస్తుతం నగరంలో పిండి రుబ్బడానికి సమయం ఉండదు. అయితే దీనినే వ్యాపార అవకాశంగా పోస్టల్ అవకాశంగా మలచుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకు పోస్టల్ శాఖలోని పోస్ట్మ్యాన్లు పిండిని సరఫరా చేస్తున్నారు.సేవలు మరింత పెరిగి, ఆర్డర్లు ఎక్కువ వస్తే పిండిని సరఫరా చేసేందుకు కొత్తగా ప్రత్యేకమైన మనుషులను నియమించనున్నట్లు తెలుస్తోంది.







