ఆడపిల్ల ఏ లోటు లేకుండా సుఖపడుతుందని.తమకు కూడా చెప్పుకోవడానికి గర్వకారణంగా వుంటుందనే ఉద్దేశ్యంతో అమ్మాయిల తల్లిదండ్రులు ఏరి కోరి ఎన్ఆర్ఐ సంబంధాలను వెతుకుతుంటారు.
ఎన్ఆర్ఐ అల్లుళ్ల బాగోతాలపై ఎన్ని వార్తలు వచ్చినా వీరు మాత్రం మారడం లేదు.భారతదేశంలో వున్నప్పుడు ఎంతో హుందాగా, మంచితనం నటిస్తూ అత్తింటి వారిని నమ్మించే కొందరు ఎన్ఆర్ఐలు.
తీరా పరాయి గడ్డ మీద అడుగుపెట్టిన తర్వాత తమ నిజ స్వరూపాన్ని చూపిస్తూ వుంటారు.
భార్యలను అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు చిత్రహింసలకు గురిచేస్తూ వుంటారు.
కొందరైతే వీరిని విడిచిపెట్టి మరో పెళ్లి చేసుకుంటున్నారు.ఎంతో కష్టపడి పెంచి, అప్పులు చేసి ఘనంగా పెళ్లి చేసిన తల్లిదండ్రుల పరువు పొకూడదనే ఉద్దేశ్యంతో అమ్మాయిలు ఆ బాధను పంటి బిగువన భరిస్తూ వుంటారు.
అటు కన్నవారికి చెప్పుకోలేక.ఇటు భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక కొందరు మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమీషన్ (ఎన్సీడబ్ల్యూ) రంగంలోకి దిగింది.ఎన్ఆర్ఐ పెళ్లిళ్లకు సంబంధించి సోమవారం అవగాహనా కార్యక్రమాలను ప్రారంభించింది.దీనిలో భాగంగా ఎన్ఆర్ఐ వివాహాల సమయంలో చేయాల్సినవి, చేయకూడనవి, అందుబాటులో వున్న నివారణ చర్యలు, చట్టపరమైన పరిష్కారాల గురించి బాధితులకు అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఎన్ఆర్ఐ వివాహాల బాధితులకు వారి హక్కులను పరిచయడం చేయడం, భారతీయ న్యాయ వ్యవస్థలో అందుబాటులో వున్న నివారణ చర్యల ద్వారా ఉపశమనం పొందడంపై అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మరోవైపు ఎన్సీడబ్ల్యూ విదేశాలలో భర్తల చేతిలో మోసానికి గురైన మహిళల కోసం గత నెలలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.జాతీయ హెల్ప్ లైన్ నెంబర్, ఈ కేసులను పరిష్కరించడంలో పోలీసు అధికారులకు శిక్షణ ఇవ్వడం, మహిళలకు వారి చట్టపరమైన హక్కుల గురించి అవగాహన కల్పించడం వంటివి ఇందులో ప్రధానమైనవి.ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్ రేఖా శర్మ.బాలికా విద్య ప్రాముఖ్యతను తెలియజేశారు.కుటుంబం, సమాజం తమ ఆలోచనలను మార్చుకుంటేనే ఈ అవగాహనా కార్యక్రమాలు విజయవంతమవుతాయని ఆమె వ్యాఖ్యానించారు.ఈ దుర్మార్గాన్ని నిర్మూలించడం మన సమిష్టి బాధ్యత అని రేఖా శర్మ తెలిపారు.








