టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ప్రకటించిన కొత్త జాతీయ పార్టీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.దేశవ్యాప్తంగా తమతో కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
అలాగే కొత్త జాతీయ పార్టీ తరఫున ప్రతి రాష్ట్రం నుంచి ఒకరికి కీలక బాధ్యతలను అప్పగించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.ఈ మేరకు అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుల ఎంపిక విషయంపై కొద్దిరోజులుగా దృష్టి సారించారు.
కొత్త జాతీయ పార్టీకి భారత్ రాష్ట్ర సమితి పేరును ఖరారు చేసినట్లుగా టిఆర్ఎస్ లోని కీలక వర్గాలు పేర్కొంటున్నాయి .అలాగే కొత్త జాతీయ పార్టీ పేరును జూన్ 19 , 20 తేదీల్లో ప్రకటించేందుకు కేసీఆర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు పార్టీ కీలక నాయకులతో అంతర్గతంగా నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారట.ఈ సందర్భంగా కొన్ని కీలక ప్రతిపాదనలు కేసీఆర్ తెరపైకి తీసుకు వచ్చారట.
టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన తర్వాత టి.ఆర్.ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ? కొత్త జాతీయ పార్టీకి కారు గుర్తును కొనసాగించాలా లేక పార్టీ జెండా రంగును ఉంచాలా ? పార్టీ అజెండాలో తెలంగాణ మ్యాప్ కు బదులు భారతదేశం మ్యాప్ పెడితే ఎలా ఉంటుందనే విషయంపైనా చర్చించినట్లు సమాచారం.ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు టిఆర్ఎస్ పార్టీని కొనసాగించి, ఆ తర్వాత టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తే ఎలా ఉంటుందనే దానిపై నిర్ణయం తీసుకున్నారట.
అలాగే కొత్త పార్టీ పేరు ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఏ ఏ రాష్ట్రాల్లో అనుకూల పవనాలు ఉన్నాయి ? ఎక్కడెక్కడ పోటీ చేస్తే బాగుంటుందనే విషయంపైన ప్రధానంగా దృష్టి పెట్టాలని కెసిఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండటంతో పార్టీని బలోపేతం ఏ విధంగా చేయాలనే విషయంపైనా చర్చించారట.ప్రత్యేక తెలంగాణ సాధించడం కోసం ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడం ద్వారా ప్రజల్లో ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి ? ఇలా అనేక అంశాలపై పార్టీ కీలక నేతలతో చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం.







