అమెరికాలో ఉన్మాదుల కాల్పుల్లో ప్రతిఏటా వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుండటంపై అక్కడి పౌర సమాజం ఆవేదన వ్యక్తం చేస్తోంది.వరుస ఘటనలను ఖండించడంతో పాటు బాధితుల సంస్మరణార్ధం ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
అలాగే దేశంలో తుపాకుల వాడకంపైనా కఠిన నిబంధనలు తీసుకురావాలని వారు చట్టసభ సభ్యులను కోరుతున్నారు.వాషింగ్టన్, న్యూయార్క్లతో పాటు దేశవ్యాప్తంగా వున్న అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రజలు నిరసనలకు దిగారు.
దీనిలో భాగంగా రాజధాని వాషింగ్టన్లోని స్మారక మైదానం ‘నేషనల్ మాల్’ వద్ద శనివారం ‘మార్చ్ ఫర్ అవర్ లైవ్స్’ పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు.
జోరు వానను సైతం లెక్కచేయకుండా వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
తుపాకీ నియంత్రణకు అమెరికా కాంగ్రెస్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.సెనేటర్లు తుపాకీ నియంత్రణ చట్టానికి అనుకూలంగా ఓటేయాలని.
లేదంటే మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని రాసి ఉన్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు.అమెరికాలో 21 ఏళ్ల లోపు వయసున్న వారికి తుపాకులు విక్రయించరాదంటూ ఇటీవల బైడెన్ యంత్రాంగం ‘తుపాకీ నియంత్రణ బిల్లు’ ప్రవేశపెట్టింది.
ఈ బిల్లు చట్టంగా మారాలంటే సెనేట్లో రిపబ్లికన్ల మద్దతు చాలా అవసరం.ఈ నేపథ్యంలో బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలంటూ ప్రజలు భారీ ప్రదర్శన చేపట్టారు.

కాగా.ఇటీవల అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన తుపాకీ వ్యతిరేక బిల్లుకు 223 – 204 ఓట్లతో చట్ట సభ్యులు మద్దతు తెలిపారు.దీని ప్రకారం సెమీ ఆటోమేటిక్ తుపాకులు కొనుగోలు చేసే వారికి కనీస వయసు ఉండాలని.అలాగే 15 రౌండ్స్ కంటే ఎక్కువ సామర్ధ్యం ఉన్న మందుగుండు సామాగ్రిని విక్రయించడానికి వీలు లేదని బిల్లులో పేర్కొన్నారు.
అయితే ఈ బిల్లు చట్టంగా మారే అవకాశాలు లేవని అంటున్నారు కొందరు నిపుణులు.ఎందుకంటే గతంలోనే సెనేట్… మానసిక ఆరోగ్య కార్యక్రమాలను, పాఠశాల భద్రత మెరుగు పరచడం, బ్యాక్ గ్రౌండ్ తనిఖీలు మెరుగు పరచడం వంటి విషయాలపై సుదీర్ఘమైన చర్చలు చేస్తోంది.
దీనికి తోడు రిపబ్లికన్ల ఆధిపత్యం వున్న సెనేట్లో అంత సులభంగా బిల్లు గట్టెక్కపోవచ్చని పరిశీలకులు అంటున్నారు.మరి ప్రజల నిరసనలతోనైనా రిపబ్లికన్ సెనేటర్ల తమ వైఖరి మార్చుకుంటారేమో చూడాలి.







