వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ అత్యున్నత స్థానాలను అధిరోహిస్తున్నారు.పురుషులే కాదు.
మహిళలు సైతం తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.ఈ క్రమంలోనే బ్రిటన్లో భారత సంతతికి చెందిన మహిళ ఒకరు చరిత్ర సృష్టించారు.
పంజాబ్ రాష్ట్రం చండీగఢ్లో జన్మించిన చారు సూద్ ఎల్ బ్రిడ్జ్ నగరానికి డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎల్ బ్రిడ్జ్ బరో కౌన్సిల్లో వరుసగా రెండోసారి ఆమె కౌన్సిలర్గా ఎన్నికయ్యారు.2018లో ఇదే స్థానం నుంచి తొలిసారిగా ఎన్నికైన చారు సూద్ మంచి పనితీరు కనబరిచారు.ఎల్ బ్రిడ్జ్లోని కన్జర్వేటివ్ పార్టీ స్టార్ క్యాండిడేట్స్లో ఆమె కూడా ఒకరు.
అంతేకాదు తిరిగి వారి స్థానాలను నిలబెట్టుకోగలిగిన కొద్దిమందిలో చారు సూద్ వున్నారు.
ఎన్నికల్లో కన్జర్వేటివ్లు సత్తా చాటని సందర్భంలోనూ ఆమె స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించారు.
చారు సూద్ విజయం పట్ల ఆమె తండ్రి శశిభూషణ్ సూద్ హర్షం వ్యక్తం చేశారు.వీరి కుటుంబం ఇప్పటికీ చండీగఢ్లోనే నివసిస్తోంది.
వరుసగా రెండవసారి ఎన్నికైన అతి పిన్న వయస్కులలో చారుసూద్ కూడా ఒకరని ఆయన అన్నారు.చండీగఢ్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె తొలుత బార్సిలోనాకు అనంతరం యూకేకు వెళ్లారు.

గత వారం మొహిందర్ కె మిదా అనే మరో భారత సంతతి మహిళ కూడా యూకేలో మేయర్గా ఎన్నికయ్యారు.వెస్ట్ లండన్లోని ఈలింగ్ కౌన్సిల్కి మేయర్గా మిదా గెలుపొందారు.ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన ఈమె బ్రిటన్లో దళితుల హక్కులపై ఎప్పటికప్పుడు తన గళం వినిపిస్తూ నిరసనలు, ఉద్యమాలతో అక్కడి ప్రజల పక్షాన నిలుస్తూ వుంటారు.ఈ నెల 5వ తేదీన జరిగిన ఎన్నికల్లో డోర్మర్ వెల్స్ వార్డ్ నుంచి కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచిన మిదా అనూహ్యంగా మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు.







