సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మం నగర రూపురేఖలు మార్చి సమగ్రాభివృద్ధి చేయగలిగామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.జూన్ 3 నుంచి జరగనున్న పట్టణ ప్రగతి పై మంత్రి పువ్వాడ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా నూతన మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఖమ్మం అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.
నగరంలో వందల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ఇతర ప్రాంతాల ప్రజలు సంతోషిస్తున్నారు అని అన్నారు.పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి నెలా ఖమ్మానికి రూ.2.70 లక్షల నిధులు వస్తున్నాయన్నారు.గోళ్లపాడు కాలువపై 100 కోట్లతో దాదాపు 11 కిలోమీటర్ల మేర అండర్ డ్రైనేజీ పైపులైన్ నిర్మించి త్రీటౌన్ ప్రజల సమస్యను పరిష్కరించామన్నారు.రానున్న 30 ఏళ్లకు సరిపడా పైపులైన్లు ఏర్పాటు చేశామన్నారు.
కార్పొరేషన్ నిధులనే కాకుండా ఇతర నిధులను నగరాభివృద్ధికి కేటాయించామన్నారు.రోడ్ల విస్తరణ, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, డ్రెయిన్లు వంటి నిర్మాణాలు చేపట్టామన్నారు.
రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.







