నల్లగొండ జిల్లా:నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు,ప్రజలందరి భాగస్వామ్యంతో పోలీస్ శాఖ నేరాల నియంత్రణ కొరకు సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తుందని సాగర్ సీఐ నాగరాజు తెలిపారు.బుధవారం సాగర్ లో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు,ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో సిసి కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు.
వీటిని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం ద్వారా నేరరహిత సమాజాన్ని నిర్మించడంలో కీలకంగా మారుతున్నాయని,అనేక కేసులును ఛేదించడంలో, దొంగతనాలు జరిగినప్పుడు సిసి కెమెరాల ద్వారా నిందితులను గుర్తించడం జరుగుతుందన్నారు.ప్రతి గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని,అప్పుడే గ్రామీణ ప్రాంతాలలో నేరాలను నియంత్రించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు,ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు సిసి కెమెరాలు ఉపయోగపడతాయని అన్నారు.
అంతే కాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగే సందర్భంలో చాలా కేసులలో టెక్కర్ చేసి పారిపోయే వాహనాలను గుర్తించే అవకాశం సైతం సిసికెమెరాలతో కలుగుతుందన్నారు.నల్లగొండ జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలకు సహకరిస్తూ ప్రతి గ్రామంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సాగర్ ఎస్ఐ, ప్రజాప్రతినిధులు,పోలీస్ సిబ్బంది,యువకులు పాల్గొన్నారు.