తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ ఆలోచనలో పడ్డారు.వైసిపి మరోసారి ఏపీలో అధికారంలోకి రాకుండా చేయాలంటే అది ఆషామాషీ వ్యవహారం కాదనే విషయాన్ని బాబు బాగా గుర్తించారు.
అందుకే ఎప్పుడూ లేని విధంగా పొత్తుల అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు.పదేపదే వైసిపి వ్యతిరేక పార్టీలు ఏకం కావాలని , ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూడాలని దీనికి అవసరం అయితే తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తుందని బాబు సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉన్నారు.
ముఖ్యంగా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బాబు తహతహలాడుతున్నారు.ఆ పార్టీ అండదండలు ఉంటే ఏపీలో చక్రం తిప్పవచ్చు అని, పవన్ అభిమానులు టిడిపి కి కలిసి వస్తారని, జనసేన సహకారంతో అధికారంలోకి సులువుగా రావొచ్చని బాబు అంచనా వేస్తున్నారు.
అందుకే జనసేన ను ఉద్దేశించి పరోక్షంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు.బిజెపి, జనసేన పార్టీలు తమతో కలిసి వస్తే భారీగానే సీట్లు కేటాయించేందుకు సిద్ధమనే సంకేతాలు బాబు పంపిస్తున్నారు.
ఈమేరకు వారితో చర్చలు జరిపేందుకు టిడిపి తరపున కొంతమందిని పరోక్షంగా నియమించినట్లు ససమాచారం.దీనికి తగ్గట్లుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం బాబు తరహాలోనే వ్యాఖ్యానిస్తున్నారు .వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీల్చేందుకు తనకు ఇష్టం లేదని , ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులు అంతా ఏకం అవ్వాల్సిన అవసరం ఉందంటూ ప్రస్తావిస్తూ ఉండటం బాబు ఆశలకు మరింత ఊతం కల్పిస్తోంది.

ఈ విషయంలో జనసేన తో పొత్తు పెట్టుకున్న బీజేపీ , టీడీపీతో పొత్తు అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది .జనసేన బీజేపీ కలిసి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తాయని పదేపదే ప్రస్తావిస్తోంది.దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందడుగు వేయలేకపోతున్నారు.
కానీ ఎన్నికల నాటికి ఏదో రకంగా జనసేన తమతో పొత్తు పెట్టుకుంటుంది అనే ఆశాభావంలో చంద్రబాబు ఉన్నారు.పవన్ సైతం టిడిపి విషయంలో సానుకూలంగా ఉండడంతో వీరి మధ్య పొత్తు కుదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.







