ఏపీలో జనసేన పార్టీ ట్రాక్ లో పడుతోంది.ఏదో విధంగా పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలనే తాపత్రయం జనసైనికులలో బలంగా కనిపిస్తోంది.
అందుకే పార్టీ పిలుపు ఇచ్చినా, ఇవ్వకపోయినా నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై జనసైనికులు పోరాడుతున్నారు.నిబద్ధత కలిగిన సైనికులు మాదిరిగా జనసేన ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు వారంతా కష్టపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.దీంతో పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు.
పవన్ బాధ్యతలను అందుకే జనసైనికులు మోస్తున్నారు.ఇక సోషల్ మీడియా విషయంలో మిగతా పార్టీలతో పోలిస్తే .జన సైనికులే ఎక్కువ యాక్టివ్ గా ఉంటున్నారు.తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన, జనసేన పైన విమర్శలు వచ్చిన వెంటనే మిగతా పార్టీలతో పోలిస్తే ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు.
యూత్ ఎక్కువగా జనసేన వైపు ఉండడమే దీనికి కారణం.దీన్ని ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటూ తమ రాజకీయ ఎత్తుగడను అమలు చేస్తోంది.
వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగతా కీలక నాయకులు గత కొద్దిరోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు.సోషల్ మీడియా ద్వారా పవన్ ను రెచ్చగొట్టే విధంగా కొంతమంది మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలను హైలెట్ చేస్తున్నారు.
దీనికి కౌంటర్ గా జనసైనికులు సదరు మంత్రుల వ్యక్తిగత విషయాలను హైలెట్ చేస్తూ కౌంటర్ ఇస్తున్నారు.ఆ కౌంటర్ లకు మంత్రులు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి.వైసిపి, జనసేన సోషల్ మీడియా యుద్ధంలో జనసైనికులు పైచేయి సాధిస్తున్నారు.అయితే ఇదంతా వైసిపి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టుగానే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఏపీలో ప్రధానంగా నెలకొన్న సమస్యల విషయంలో ప్రజల దృష్టిని మార్చేందుకు మీడియా ఫోకస్ తగ్గించేందుకు ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.ఇటీవల రుయా ఆస్పత్రిలో ఆంబులెన్స్ దొరకక చనిపోయిన కొడుకుని బైక్ పై 90 కిలో మీటర్ల దూరం తీసుకువెళ్లిన తండ్రి వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది.
ఈ విషయం మరీ ఎక్కువ ఫోకస్ కాకుండా మంత్రి అంబటి రాంబాబు రంగంలోకి దిగారు.వంగవీటి రంగా హత్య ఉదంతాన్ని టిడిపిని ముడిపెడుతూ పవన్ పై ఆయన విమర్శలు చేశారు.

ఇక మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం ఇదే విధంగా పవన్ పై సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేయడం, అమర్నాథ్ వ్యక్తిగత వ్యవహారాలను జనసైనికులు బయటకు తీసి కౌంటర్లు ఇవ్వడం వంటి వ్యవహారాలు బాగా ఫోకస్ అయ్యాయి.దీంతో ప్రధాన సమస్య డైవర్ట్ అయిపోయింది.గతంలో ఏపీలో అధ్వానంగా రోడ్ల విషయంపై జనసేన పార్టీ దృష్టి పెట్టి సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకు వెళ్ళింది.ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం కు చాలానే డ్యామేజ్ జరిగింది.
కానీ ఇప్పుడు ఆ తరహాలో ప్రజా సమస్యలను జనసేన హైలెట్ చేయకుండా వైసిపి పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా జనసైనికుల రూట్ మార్చే విషయంలో సక్సెస్ అవుతున్నట్టుగానే కనిపిస్తోంది.







