ప్రశాంతంగా జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.సీఎం కేసీఆర్, కేటీఆర్ డైరెక్షన్ లోనే దాడులు జరుగుతున్నాయన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు జిల్లాలో అడుగడుగున స్థానికుల నుంచి నిరసన సెగ తగులుతుంది.పాదయాత్రపై ఇప్పటికే ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.రెండో విడత యాత్రలో భాగంగా ఐదో రోజు గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో పర్యటించారు సంజయ్.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ యాత్రను అడ్డుకునేందుకు యత్నించారు.దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది.ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు.
బండి సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయగా.
కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు.దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.అయితే బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడం బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం చూసి టీఆర్ఎస్ నేతల్లో ఫ్రస్టేషన్ పెరిగి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.సమైక్య పాలనకు మించి కేసీఆర్ ద్రోహం చేస్తున్నారని పాదయాత్రలో సంజయ్ మండిపడ్డారు.
ప్రజలు ఎక్కడికక్కడ పాలకులను నిలదీయాలని పిలుపునిచ్చారు.
బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
టీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించిన ఓ కారును ధ్వంసం చేశారు.పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
తిరిగి బండి సంజయ్ తన పాదయాత్రను కొనసాగించారు.పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంపై సంజయ్ స్పందించారు.
టీఆర్ఎస్ శ్రేణులు ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.పాదయాత్ర ద్వారా పాలమూరు ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని అన్నారు.
ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చేసే హక్కు, ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉందన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందునే పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఐదో రోజు బండి సంజయ్ పాదయాత్ర గద్వాల జిల్లాలోని వేముల, బట్లదిన్నె, షాబాద్ గ్రామాల మీదుగా ఉదండపూర్ వరకు సాగింది.ఇటీవలే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ఆలంపూర్ నుంచి సంజయ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.గద్వాల, మక్తల్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర, నారాయణపేట, కల్వకుర్తి మీదుగా సాగనున్న ఈ పాదయాత్ర… మే 14న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో ముగియనుంది.







