వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు.భారత సంతతికి చెందిన ప్రజలు ప్రపంచంలో ఎక్కడా వున్నా భారతదేశ గుర్తింపును సజీవంగా వుంచుతారని పేర్కొన్నారు.
భారతీయ- అమెరికన్లు తమ స్వదేశానికి వేల మైళ్ల దూరంలో వున్నప్పటికీ.తమ సంస్కృతికి గుర్తింపును తీసుకురావడంతో పాటు కొనసాగిస్తున్నారని కొనియాడారు.
వాషింగ్టన్ డీసీలో జరిగిన ఇండో- అమెరికన్ల 2+2 మంత్రుల భేటీకి హాజరయ్యేందుకు రక్షణ మంత్రి అమెరికాకు వచ్చారు.అనంతరం IndoPACOM సమావేశంలో పాల్గొనేందుకు గాను హవాయికి అక్కడి నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లారు రాజ్నాథ్.
ఐదు రోజుల అమెరికా పర్యటన ఫలవంతమైనందని.ఆ దేశ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్తో సమావేశాలు అద్భుతంగా జరిగాయన్నారు.సోమవారం ఆస్టిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.ఇండో పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతంతో సహా ద్వైపాక్షిక రక్షణ సహకారం, ప్రాంతీయ భద్రతా పరిస్ధితిని సమీక్షించారు.
గురువారం శాన్ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ నిర్వహించిన రిసెప్షన్లో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇండో అమెరికన్ కమ్యూనిటీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.ప్రజలు ఏదో ఒక ప్రదేశంలో ఎక్కువ కాలం వున్నప్పుడు వారి సాంస్కృతిక గుర్తింపు కోల్పోతారని రాజ్నాథ్ సింగ్ అన్నారు.అయితే మనదేశానికి వెలుపల నివసిస్తున్న భారతీయులు తమను తాము భారతీయులుగా పిలుచుకోవడాన్ని ఎల్లప్పుడూ గర్వంగా భావిస్తారని వ్యాఖ్యానించారు.
తన రాజకీయ జీవితంలో నాలుగోసారి అమెరికాకు, శాన్ఫ్రాన్సిస్కోకు మొదటిసారి వచ్చినట్లు తెలిపారు.

అధికారిక పర్యటనలో కాకుండా రాజకీయ నాయకుడిగా అమెరికాకు వచ్చి వుంటే పలు చోట్ల భారతీయులను కలుసుకునేవాడినని రాజ్నాథ్ తెలిపారు.భారత్, అమెరికాలు అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తులుగా.ప్రపంచ శాంతిని స్థాపించగల సామర్ధ్యాన్ని కలిగి వున్నాయన్నారు.
ఇరు దేశాల మధ్య ఆర్ధిక, వ్యూహాత్మక, రక్షణపరంగా సంబంధాలు వున్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.భారత్- అమెరికాలు సహజ మిత్రదేశాలని ప్రపంచం మొత్తానికి తెలుసునన్నారు.
యూఎస్లో కొత్త శిఖరాలకు ఎదుగుతున్న భారతీయ ప్రవాసులు ఇరు దేశాల సంబంధంలో కీలకపాత్ర పోషిస్తున్నారని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు.







