భారతీయ విద్యార్ధి కార్తీక్ వాసుదేవ్ హత్యకు సంబంధించి దర్యాప్తులో కెనడా పోలీసులు పురోగతి సాధించారు.అతనిని కాల్చి చంపినట్లుగా భావిస్తున్న 39 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు టొరంటో పోలీసులు మంగళవారం ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన కార్తీక్ ఉన్నత చదువులు అభ్యసించేందుకు కెనడాకు వెళ్లినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.గత గురువారం టొరంటోని సెయింట్ జేమ్స్ టౌన్లోని షెర్బోర్న్ టీటీసీ స్టేషన్ సమీపంలోని గ్లెన్ రోడ్ ఎంట్రన్స్ వద్ద కార్తీక్పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.
దీంతో తీవ్ర గాయాలపాలై కుప్పకూలిన కార్తీక్కు ఆఫ్ డ్యూటీలో వున్న పారామెడిక్ ఒకరు ప్రథమ చికిత్స అందించి.హుటుహుటీన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ అతను కన్నుమూశాడు.
ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడిని రిచర్డ్ జోనాథన్ ఎడ్విన్గా పోలీసులు గుర్తించారు.
ఇతను శనివారం మరొకరిని హత్య చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.రిచర్డ్ చేతుల్లో బలైన రెండో వ్యక్తిని ఎలిజా ఎలియాజర్ మహేపత్గా గుర్తించారు.
ఇతను జార్జ్ స్ట్రీట్ సమీపంలోని డుండాస్ స్ట్రీట్ ఈస్ట్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా హత్య జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

తమ బిడ్డను కాల్చి చంపిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కెనడా పోలీసులు తమకు సమాచారం అందించారని కార్తీక్ వాసుదేవ్ తండ్రి జితేష్ వాసుదేవ్ మీడియాకు తెలిపారు.కెనడాలో వున్న భద్రత, ఉపాధి అవకాశాల కారణంగానే తమ కుమారుడు ఆ దేశం వైపు ఆకర్షితుడైనట్లు జితేష్ పేర్కొన్నారు.అక్కడికి వెళ్లిన తర్వాత మెక్సికన్ రెస్టారెంట్లో పార్ట్టైం ఉద్యోగం సంపాదించాడని .గురువారం మధ్యాహ్నం చివరిసారిగా తాను , తన భార్య కార్తీక్తో మాట్లాడినట్లు జితేష్ కన్నీటి పర్యంతమయ్యారు.
సెనెకా కాలేజీలో మార్కెటింగ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్లో కార్తీక్ ఎన్రోల్ చేసుకున్నట్లు ఆ కళాశాల యాజమాన్యం తెలిపింది.
అతని హత్య గురించి తెలుసుకున్న సెనెకా కాలేజీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.అటు కార్తీక్ మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు కెనడాలోని ఇండియన్ హై కమీషన్ రంగంలోకి దిగింది.
అతని కుటుంబంతో తాము టచ్లో వున్నట్లు అధికారులు తెలిపారు.మృతదేహం తరలింపునకు సంబంధించి కెనడా అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు భారత హై కమీషన్ వెల్లడించింది.







