వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ అంటే వినయ విధేయతలను ప్రదర్శిస్తూ ఉంటారు మాజీమంత్రి కొడాలి నాని.పదవి ఉన్నా, లేకపోయినా తాను ఎప్పుడు జగన్ వెంటే నడుస్తానని, అసలు పదవులు లేకపోతే టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పైన మరింతగా దృష్టి పెట్టేందుకు తనకు అవకాశం ఏర్పడుతుందని అనేక సందర్భాల్లో చెప్పారు.
కొత్తగా మంత్రి వర్గం ఏర్పడింది .దీంట్లో కొడాలి నాని పేరు లేకపోవడం చర్చనీయాంశం అయ్యింది.జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన నాని ని జగన్ పక్కన పెట్టడం పై టిడిపి , జనసేన పార్టీలు వ్యంగ్యంగానే సానుభూతిని తెలియజేశాయి.మంత్రి పదవి లేకపోయినా , మునుపటికన్నా ఉత్సాహంగా పని చేస్తానంటూ కొడాలి నాని చెబుతున్నారు.
అయితే జగన్ మాత్రం సముచిత స్థానాన్ని కల్పించాలని భావిస్తున్నారు.నాని వంటి వారికి కీలక పదవులు ఇవ్వడం ద్వారా, కమ్మ సామాజిక వర్గం ద్వారానే టిడిపి అధినేత చంద్రబాబు వంటి వారికి చెక్ పెట్టవచ్చనేది జగన్ ఆలోచన.
ఈ మేరకు త్వరలోనే నానికి జగన్ క్యాబినెట్ ర్యాంక్ తో కూడిన పదవిని ఇవ్వబోతున్నట్లు సమాచారం.అయితే ఆ పదవి ఏంటనేది ఎవరికి తెలియదు.
ఇదే ఈ విషయం పై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని అది జగన్ కు తనకు మధ్య ఉన్న సీక్రెట్ అంటూ చమత్కరించారు.దీంతో నానికి ఏ పదవి ఇస్తున్నారు అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
ఇప్పటికే మంత్రి పదవులు పోగొట్టుకున్న వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే కేబినెట్ ఏర్పాటు చేసే సమయంలో రెండున్నర సంవత్సరాలు మాత్రమే పదవీకాలం ఉంటుందని ఆ తర్వాత అందరిని తొలగిస్తాను … అందుకు సిద్ధంగా ఉండాలి అంటూ జగన్ చెప్పినా, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకతోటి సుచరిత, ఇలా చాలామంది తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.ఇక ఎమ్మెల్యేల్లోనూ మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారు పదవులు దక్కకపోవడంతో అక్కడ అక్కడ తమ అసంతృప్తిని బహిరంగంగా తెలిసేలా అనుచరుల ద్వారా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.కొడాలి నాని పేర్ని నాని వంటివారు మాత్రం జగన్ నిర్ణయం స్వాగతిస్తూ , పార్టీ కోసం , జగన్ కోసం తాము దేనికైనా సిద్ధం అంటూ ప్రకటించారు.
ఈ క్రమంలోనే వీరికి త్వరలోనే కీలక పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.







