అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్లో దుండగుడి చేతిలో హత్యకు గురైన భారతీయ యువకుడు జాన్ దియాస్ మరణం ఇరు దేశాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.ఇంతటి విషాదానికి కారణమైన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హంతకుడికి సంబంధించిన సమాచారం అందిస్తే 5,000 డాలర్ల రివార్డ్ ప్రకటించారు దర్యాప్తు అధికారులు.సీసీటీవీ ఫుటేజ్లో అనుమానితుడు నల్లటి దుస్తులు, ముసుగు ధరించి వున్నాడు.
మార్ట్లోకి ప్రవేశించి దాని చుట్టూనే తిరుగుతూ వేచి వున్నట్లు యూఎస్ మీడియా కథనాలు ప్రచురించింది.ఈ సందర్భంగా క్రైమ్స్టాపర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ హ్యూస్టన్ వాసులుగా ఈ ఘటనపై తాము శ్రద్ధ వహిస్తున్నామని చెప్పారు.
భారతీయ యువకుడి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.
మరోవైపు జాన్ దియాస్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియ ప్రారంభమైంది.
హ్యూస్టన్లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఈ మేరకు లాంఛనాలను పూర్తి చేసే పనిలో పడింది.గోవా రాజధాని పనాజీలోని ఎన్ఆర్ఐ వ్యవహారాల కార్యాలయానికి కాన్సులేట్ జనరల్ నుంచి సమాచారం అందిందని ఎన్ఆర్ఐ అఫైర్స్ డైరెక్టర్ ఆంథోని డిసౌజా తెలిపారు.
దియాస్ మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి, అలాగే అతని మరణ ధ్రువీకరణ పత్రం కోసం సహాయాన్ని కోరుతూ కాన్సులేట్ కార్యాలయం లేఖ రాసిందని డిసౌజా చెప్పారు.ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సైతం అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పినట్లు డిసౌజా పేర్కొన్నారు.
మరణించిన వ్యక్తి భారతీయ పాస్పోర్ట్ హోల్డర్ అయినందున కాన్సుల్ జనరల్ ఈ లాంచనాలపై దృష్టి పెట్టారు.అలాగే అమెరికా పోలీసులు ఈ హత్యపై దర్యాప్తు పూర్తి చేయాలని డిసౌజా చెప్పారు.
ఎన్ఆర్ఐ వ్యవహారాల కమీషనర్ కార్యాలయం కూడా మృతుడి తల్లికి పరిహారాన్ని కోరుతోందన్నారు.జాన్ తల్లికొడుకును పెంచడానికి చాలా కష్టపడిందని డిసౌజా చెప్పారు.
చందోర్ చర్చి సమీపంలోని ఒక గదిలో నివసిస్తోందని ఆయన పేర్కొన్నారు.

కాగా.గోవా రాష్ట్రం చందోర్కు చెందిన జాన్ దియాస్ హ్యూస్టన్లోని ఓ గ్యాస్ స్టేషన్లో స్టోర్ క్లర్క్గా పని చేస్తున్నాడు.ఈ క్రమంలో ఆదివారం స్టోర్లో ఉండగా అక్కడికి ఓ దుండగుడు వచ్చాడు.
అప్పటికే భారీగా కస్టమర్లు ఉండడంతో అతను ఆ ప్రాంతంలోనే తచ్చాడాడు.జనం వెళ్లిపోయిన తర్వాత తుపాకీ గురిపెట్టి నగదు ఇవ్వాలని దియాస్ను బెదిరించాడు.
అందుకు జాన్ నిరాకరించడంతో దుండగుడు ఆగ్రహంతో ఊగిపోయాడు.వెంటనే అతనిపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరపడంతో దియాస్ అక్కడికక్కడే కుప్పకూలాడు.
అనంతరం దుండగుడు నగదుతో పరారయ్యాడు.








