టాలీవుడ్ స్టార్ హీరోగా, జనసేన అధినేతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.2014 సంవత్సరంలో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఒక విధంగా కారణమనే సంగతి తెలిసిందే.ఆ సమయంలో పవన్ టీడీపీకి మద్దతు ఇవ్వడం ఆ పార్టీకి చాలా ప్లస్ అయింది.అయితే 2019లో మాత్రం టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేయగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలడం వల్ల వైసీపీకి ప్లస్ అయింది.
2019 సంవత్సరంలో 151 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉంటే మాత్రం 2019 ఎన్నికల ఫలితాలు మరో విధంగా ఉండేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
తాజాగా జనసేన ఆవిర్భావ సభ జరగగా ఈ సభలో వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనని పవన్ క్లారిటీ ఇచ్చారు.బీజేపీ, టీడీపీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పేశారు.
2024 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రాకుండా చేయడానికి పవన్ కళ్యాణ్ తెలివిగా అడుగులు వేస్తుండటం గమనార్హం.

అయితే 2024 సంవత్సరంలో పవన్ సపోర్ట్ చేసిన పార్టీ అధికారంలోకి రావాలన్నా కొన్ని సమస్యలు ఉన్నాయి.ప్రస్తుతం పవన్ జనసేన, బీజేపీ కలిసి పని చేస్తున్నాయి.గతంలో చంద్రబాబు మోదీపై విమర్శలు చేసిన నేపథ్యంలో బీజేపీ టీడీపీ కలవడం సాధ్యం కాదు.
టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే సీఎం అభ్యర్థి పవన్ కాకపోతే పవన్ అభిమానులు కచ్చితంగా ఫీలవుతారు.టీడీపీ జనసేన కలిసి పని చేసినా ఇరు పార్టీలు సీట్లను పంచుకుంటే జనసేన అభ్యర్థులు పోటీ చేసిన చోట టీడీపీ రెబల్స్ నుంచి టీడీపీ అభ్యర్థులు పోటీ చేసిన చోట జనసేన రెబల్స్ నుంచి ఇబ్బందులు తప్పవు.

మరోవైపు ఏపీలో వైసీపీపై వ్యతిరేకత ఉన్నా అధికారం కోల్పోయేంత వ్యతిరేకత లేదు.టీడీపీ జనసేన కూటమి పోటీ చేస్తే మాత్రం వైసీపీ మేనిఫెస్టో కంటే టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో మెరుగ్గా ఉంటే మాత్రమే ఈ కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది.అయితే వైసీపీ, టీడీపీ జనసేన కూటమి మధ్య గట్టి పోటీ మాత్రం కచ్చితంగా ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.








