ఇరాన్ పై అగ్రరాజ్యం అమెరికా తాజాగా మరిన్ని ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో అమెరికా తాజా ఆంక్షల పై ఇరాన్ మండిపడింది.
తమ దేశాధినేత ను లక్ష్యంగా చేసుకొని అమెరికా విధించిన ఆంక్షలు దారుణం, మూర్ఖత్వం అంటూ ఇరాన్ దుయ్యబట్టింది.అమెరికా తాజా ఆంక్షలు వైట్హౌస్ మానసిక దౌర్బల్యానికి నిదర్శనమని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రొహానీ కూడా విమర్శించారు.
అగ్రరాజ్యం విధించిన ఈ ఆంక్షలతో ఇరుదేశాల మధ్య దౌత్య మార్గాలు శాశ్వతంగా మూసుకుపోయినట్లే అని రొహౌని స్పష్టం చేశారు.తమ దేశాధినేత ఆయతుల్లా ఆలీఖొమైనీ 80 ఏళ్ల వృద్ధుడని ఆయనకు అమెరికాలో పర్యటించే ఆలోచన కూడా లేనపుడు ఆయనపై ఈ విధంగా ఆంక్షలు విధించటం మూర్ఖత్వమే అవుతుందని రొహానీ అన్నారు.
మరోపక్క ఇరాన్ నాయకత్వంపై ఆంక్షలు విధించటం తో ఎలాంటి ఫలితం ఉండబోదని, పైగా ఈ విధంగా ఆంక్షలు విధించడం వల్ల ఇరుదేశాల మధ్య దౌత్య మార్గాలు మూసుకుపోవటానికి కూడా కారణమవుతున్నాయని ఇరాన్ విదేశాంగశాఖ ప్రతినిధి అబ్బాస్ మొసావీ కూడా వ్యాఖ్యానించారు.

అయితే ట్రంప్ ఈ విధంగా ఇరాన్ పై రోజు రోజుకు ఆంక్షలు విధించడానికి ప్రధాన కారణం ఆ దేశం చర్చలకు రప్పించడానికే అని అమెరికా రాయబారి జోనాథన్ కోహెన్ అంటున్నారు.అయితే అమెరికా విధిస్తున్న విపరీత ఆంక్షలకు విసుగెత్తిన ఇరాన్ మాత్రం ఆంక్షలు విధించి బెదిరింపులకు పాల్పడితే చర్చలకు అవకాశమే లేదని అంటుంది.మరి ట్రంప్ తీరు మారదు,అలానే ఇరాన్ తన పద్దతిని మార్చుకోదు, రోజు రోజుకు ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగా క్షీణించి ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.







