ఏపీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న ధీమాను కనబరిచిన జనసేన పార్టీ ప్రభావం అంతంతమాత్రమే అన్నట్టుగా పోలింగ్ అనంతరం తేలిపోయింది.ఆ పార్టీకి 30 – 40 సీట్లు వస్తాయన్న సంగతి అలా ఉంచితే కనీసం 5 – 6 సీట్లు వస్తే గొప్పే అన్నట్టుగా ఉంది వాస్తవ పరిస్థితి.
ఎన్నికల ముందు ఒంటరిగా బరిలోకి దిగబోతున్నాం సీఎం పీఠం దక్కించుకోబోతున్నాం అని ధీమాగా చెప్పిన పవన్ ఆ తరువాత మాత్రం వామపక్ష పార్టీలతో పాటు బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాడు.అలాగే రాయలసీమలో జనసేన పార్టీ ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది.
నాలుగు జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది.ఆఖరికి కొన్ని సీట్లకు జనసేనకు అభ్యర్థులే లేకుండా పోయారు.
జనసేన పార్టీ అభ్యర్థులు కొన్ని కొన్ని చోట్ల నామమాత్రం పోటీ ఇవ్వగా మరికొన్ని చోట్ల పోటీ చేసేందుకు గట్టి అభ్యర్థులు కూడా దొరకలేదు.అలాగే హిందూపురం ఎంపీ సీటుకు జనసేన తరఫు నుంచి కానీ ఆ పార్టీ కూటమిలోని వారి తరఫు నుంచి ఒక్క అభ్యర్థి కూడా ముందుకు రాలేదు.
కనీసం ఎంపీ సీట్లకు అభ్యర్థులు పెట్టుకోలేని రీతిలో పవన్ కల్యాణ్ రాజకీయం సాగిందని స్పష్టంగా అందరికీ అర్ధం అవుతోంది.ఇక ఓట్ల విషయానికి వస్తే జనసేన కొద్దో గొప్పో ఓట్లను సంపాదించుకున్నదనేది మాత్రం వాస్తవం.
ప్రత్యేకించి అవి బలిజల ఓట్లు.వాటితో పాటు పవన్ కల్యాణ్ సినీ అభిమానుల ఓట్లు కూడా ఎక్కువగానే పడ్డాయి.
కానీ టీడీపీ, వైసీపీ పార్టీలకు ఉన్నట్టుగా సాంప్రదాయ ఓటర్లు జనసేనకు లేరనే చెప్పాలి.విజయం కోసం అభ్యర్థులు కాస్త గట్టిగా కష్టపడినా నియోజకవర్గాల్లో జనసేన స్థాయి పదివేల ఓట్ల వరకూ వచ్చిందనే టాక్ కూడా ఇప్పుడు నడుస్తోంది.కర్నూలు జిల్లాల్లో ఎస్పీవై రెడ్డి కి అలాగే అనంతపురం అర్బన్లో, ధర్మవరం నియోజకవర్గంలో, చిత్తూరు జిల్లా తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లలో జనసేన కాస్త ఓట్లను ఎక్కువగానే సంపాదించినట్టు లెక్కలు చెబుతున్నాయి.ఇటువంటి నియోజకవర్గాల్లో సాధారణంగా అభ్యర్థులు మెజారిటీలు పొందే స్థాయిలో జనసేన ఓట్లను పొందింది.
ఒక లెక్కప్రకారం చూస్తే.జనసేనకు పడ్డ ప్రతి వంద ఓట్లలో ఎనభై వరకూ టీడీపీకి పడాల్సిన ఓట్లే అన్నది ఇప్పుడు అందరూ మాట్లాడే మాట.మొత్తంగా చూస్తే జనసేన ప్రభావంతో వైసీపీ, టీడీపీ పార్టీలు కొంత ఆందోళనగానే ఉన్నాయి.జనసేన చీల్చిన ఓట్లు ఎవరి కొంప ముంచుతుందో అన్న కారణంతో.