తెలుగు రాష్ట్రాల ఎన్నికల వేడిలో ప్రధాన పార్టీలు తమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి.ముఖ్యంగా ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలకి దీటుగా మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
ఎదురుదాడే లక్ష్యంగా తెలుగుదేశం, వైసీపీ వైఫల్యాలని ఎత్తి చూపిస్తూ, బలమైన శక్తిగా తనని తాను చూపించుకునే ప్రయత్నం జనసేనాని చేస్తున్నారు.ఒక వేళ మొదటి స్థానంలో లేకపోయినా ప్రభుత్వ ఏర్పాటులో తాను కీలకంగా మారాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఏపీలో తన సత్తా చాటుతూ రోజు రోజుకి బలం పెంచుకుంటున్న పవన్ కళ్యాణ్ బీఎస్పీ అధినేత్రి మాయావతితో పొత్తు పెట్టుకొని టీడీపీ, వైసీపీ పార్టీలకి ఊహించని షాక్ ఇచ్చాడు.ఇక మొదటి నుంచి తమతో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలకి కేవలం ఏడు సీట్లు చొప్పున ఇచ్చిన పవన్ బీఎస్పీకి ఏకంగా 21 సీట్లు ఇచ్చాడు.
అయితే దీని వెనుక వైసీపీని దెబ్బ కొట్టే వ్యూహం ఉందని రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపించింది.కాని బీసీల నుంచి, బడుగు, బలహీన వర్గాల వారి వరకు అందరికి తాను పెద్ద పీట వేస్తానని చెప్పడానికి బీఎస్పీకి అన్ని సీట్లు కేటాయించినట్లు ప్రజల్లోకి తీసుకెళ్ళాడు.
ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ పార్టీ కోసం మాయావతి ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది.ఇవాళ సాయంత్రం ఏపీకి రానున్న ఆమె రేపు, ఎల్లుండి ఏపీ, తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు.రేపు విశాఖలో మధ్యాహ్నం పవన్, మాయావతి సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడుతారు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో జరిగే బహిరంగలో పాల్గొంటారు.ఇక 4వ తేదీ మధ్యాహ్నం తిరుపతిలో నిర్వహించనున్న ఎన్నికల సభలో మాయావతి, పవన్ పాల్గొంటారు.
అదేరోజు సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగనున్న బహిరంగ సభకు హాజరవుతారు.అయితే మాయావతి ఎన్నికల ప్రచారం ఏపీలో జనసేనకి ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.