ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ల మల్టీస్టారర్ చిత్రం కొన్నాళ్ల క్రితం ప్రారంభం అయ్యింది, రాజమౌళి సినిమా షూటింగ్ ప్రారంభించాడు.అయితే సినిమా ఏంటీ, కథ ఏంటీ, హీరోయిన్స్ ఎవరు అనే రకరకాల ప్రశ్నలు సినీ జనాల్లో మరియు ప్రేక్షకుల్లో వెంటాడుతూనే ఉన్నాయి.
మీడియాలో వందలు, వేల కొద్ది పుకార్లు ఈ సినిమా గురించి షికార్లు చేశాయి.సినిమాకున్న క్రేజ్ నేపథ్యంలో చిన్న పుకారు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యేంది.
అలాంటి సమయంలో రాజమౌళి పుకార్లన్నింటికి చెక్ పెట్టాడు.
నేడు సినిమాకు సంబంధించిన ప్రెస్మీట్ పెట్టి టైటిల్ మరియు కథ విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చాడు.
మొదట వర్కింగ్ టైటిల్గా అనుకున్న ఆర్ఆర్ఆర్ టైటిల్నే అన్ని భాషల టైటిల్గా నిర్ణయిస్తున్నట్లుగా రాజమౌళి ప్రకటించాడు.అయితే ఆర్ఆర్ఆర్ కు వివిధ భాషల్లో వివిధ విస్తరణ ఉంటుందని చెప్పుకొచ్చాడు.
తెలుగులో ఆ టైటిల్ ఏంటీ అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.ఆర్ఆర్ఆర్ కు విస్తరణగా ఎంతో మంది ఎన్నో సలహాలు ఇచ్చారు.
ఇంకా మంచి సలహాలు వస్తే దాంట్లో ఒకదాన్ని తీసుకుంటామని రాజమౌళి చెప్పాడు.

ఇక కథ విషయానికి వస్తే… అల్లూరి సీతారామ రాజు మరియు కొమురం భీంల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని ప్రకటించాడు.రెండు మూడు సంవత్సరాల తేడాతో జన్మించిన అల్లురి సీతారామ రాజు మరియు కొమురం భీంలు వారి యుక్త వయసులో ఉన్న సమయంలో రెండు మూడు సంవత్సరాల పాటు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు.ఆ సమయంలో వారు ఎటు వెళ్లారు అనే విషయం ఎవరికి తెలియదు.
వారిద్దరు ఒకరికి ఒకరు సంబంధం లేని వ్యక్తులు.ఒకరు ఆంధ్రాలో జన్మిస్తే మరొకరు తెలంగాణలో జన్మించారు.
ఇద్దరి జీవితాల్లోని ఆ అజ్ఞాతంకు సంబంధించిన విషయం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది.అందుకే వారి కథతో నేను సినిమా తీస్తున్నాను అన్నాడు.
అల్లూరి సీతారామరాజు, కొమురం భీంల కథలు అందరికి తెల్సిందే.అయితే వారి జీవితంలో కొన్ని తెలియని సంఘటనలతో ఈ చిత్రం కథ అల్లినట్లుగా రాజమౌళి చెప్పాడు.
అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారని కూడా రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.ఇండియాలోని దాదాపు పది భాషల్లో ఈ చిత్రం విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిర్మాత వెళ్లడించాడు.







