తెలంగాణ ఎన్నికల సమరం సాగుతోంది.నామినేషన్ల గడువు కూడా ముగిసింది.
ఇక పోలింగ్ తేదీని దృష్టిలో పెట్టుకుని అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం వేడెక్కిస్తూ ముందుకు వెళ్తున్నాయి.టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా … ఆ పార్టీ ప్రత్యర్థి పార్టీలన్నీ కూటమిగా ఏర్పడి టీఆర్ఎస్ ఓటమికి పావులు కదుపుతున్నాయి.ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ కూడా తెలంగాణ ఎన్నికల బరిలో దిగింది.అయితే… ఇప్పుడు అందరి దృష్టి ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ… కొత్తగా ఎన్నికల బరిలో దిగబోతున్న జనసేన పార్టీల మీద ఉన్నాయి.తెలంగాణాలో ఈ రెండు పార్టీలు తాము పోటీ చేయడం లేదు అంటూ ముందుగానే ప్రకటించేసాయి.అయితే ఈ రెండు పార్టీలు ఎవరికి మద్దతు ప్రకటించబోతున్నాయి అనేది అంతా ఆసక్తి నెలకొంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పేశారు.ఎందుకంటే, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని తాము అనుకోలేదనీ, అందుకే మేము ముందుగా సిద్ధం కాలేకపోయామని చెన్నైలో పవన్ కల్యాణ్ చెప్పారు.సాధారణ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగి ఉంటే కొన్ని చోట్ల పోటీ చేయాలనే ఆలోచన తమకు ఉందన్నారు.తెలంగాణ ఎన్నికలపై పార్టీలోని నాయకుల సమావేశం జరిగిందని, శాసనసభ ఎన్నికల్లో కాకుండా షెడ్యూల్ ప్రకారం జరగబోయే లోకసభ ఎన్నికలలో పోటీ చేయాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు గా పవన్ తేల్చి చెప్పేసారు.

వాస్తవానికి గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్తో పవన్ ఎంతో సన్నిహితంగా మెలుగుతున్నారు.ఈ పరిస్థితుల్లో ఆయన కేసీఆర్కు అండగా నిలిచి టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతునిస్తారని ఎక్కువమంది భావిస్తున్నారు.ఇక, తెలంగాణ ఎన్నికల్లో పోటీ అంశమై వైసీపీ మొదట్నుంచీ పెద్దగా దృష్టిపెట్టలేదు.2014 ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణపై వైసీపీ ఆశలు వదిలేసుకున్నట్టే వ్యవహరించింది.టీఆర్ఎస్ అసెంబ్లీ రద్దు చేశాక పోటీ గురించి గానీ, ఇక్కడి రాజకీయ పరిస్థితుల మీద కానీ … ఇంతవరకూ జగన్ నోరు విప్పలేదు.తెలంగాణలో దివంగత వైఎస్.
రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఇప్పటికీ చాలామంది ఉన్నారంటూ వైసీపీ నేతలు కూడా అంటుంటారు.తాజా ఎన్నికల సందర్భంగా ఆ అభిమానులకు జగన్ కూడా ఎలాంటి దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేయడం లేదు.
ఈ విషయంలో పెదవి విప్పకపోవడమే బెటర్ అన్న ఆలోచనలో జగన్ ఉన్నాడట.







