విశాఖలో వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగిన జరిగిన దాడి వ్యవహారంపై వైసీపీ నేతలు ఇంకా రగులుతూనే ఉన్నారు.టిడిపి, ఏపీ పోలీసులపై కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు.
తాజాగా వైసిపి నాయకురాలు రోజా పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ పోలీసులు ఇంటెలిజెన్స్ అధికారులు దున్నపోతు నుంచి పాలు తీస్తున్నారా అంటూ ఆమె ప్రశ్నించారు.హైదరాబాదులోని వైసిపి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆపరేషన్ గరుడ గురించి సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు డీజీపీ, ఇంటలిజెన్స్ డీజీ వెంకటేశ్వరావు పక్కన కూర్చోబెట్టుకుని మరి చెప్పడం సిగ్గు చేటని ఆమె అన్నారు.ఆ మీడియా సమావేశంతో… డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలు చేతకాని దద్దమ్మలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఒప్పుకుందన్నారు.
మరి అలాంటప్పుడు ఠాకూర్, వెంకటేశ్వరావును తప్పించి శివాజీ చౌదరికి ఆ బాధ్యతలు అప్పగిస్తే మంచిదని సూచించారు.ఆపరేషన్ గరుడ అన్నది ఓ డ్రామా అనీ, దీన్ని నటుడు శివాజీతో చంద్రబాబు, లోకేశ్ ఆడిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై గుంటూరులో చెప్పులు వేయించిన చంద్రబాబు, ఇటీవల ఢిల్లీలో ఆయన చెప్పులను తలపై పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.తొలుత కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం కోడలు బ్రాహ్మణిని రాహుల్ హాజరయ్యే పారిశ్రామివేత్తల సదస్సుకు చంద్రబాబు పంపారని ఆరోపించారు.అదే చంద్రబాబు కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా డైరెక్టుగా రాహుల్ తో చేతులు కలిపారన్నారు.టీడీపీ-కాంగ్రెస్ పొత్తు చూసి ఏపీ ప్రజలు చీదరించుకుంటున్నారని రోజా వ్యాఖ్యానించారు.
టీడీపీని చంద్రబాబు తెలుగు దాల్ పప్పుగా మార్చేశారని ఎద్దేవా చేశారు.