ఎన్నికల యుద్ధంలో గెలుపు దక్కాలంటే.అలుపెరగకుండా యుద్ధం చేయాల్సిందే.
శత్రువుల బలాలు.బలహీనతలను తెలుసుకుని ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు వెళ్లాల్సిందే.
ఇలాంటి విషయాల్లో టీఆరఎస్ అధినేత కాస్త ముందే ఉంటారు.తన ప్రత్యర్థి పార్టీలు ఇంకా సీట్ల సర్దుబాటు, ఆధిపత్యపోరు, గ్రూపు తగాదాల్లో కొట్టుమిట్టాడుతుంటే కేసీఆర్ ఇదే అదునుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
దీనిలో భాగంగా ఇప్పుడు భారీ బహిరంగ సభలపై దృష్టి పెట్టారు.

భారీ బహిరంగ సభల ద్వారా పార్టీ క్యాడర్లో జోష్ పెరగడంతో పాటు.ప్రజల్లోకి వేగంగా వెళ్లవచ్చని అంచనాకు కేసీఆర్ వచ్చాడు.అసెంబ్లీ రద్దు ప్రకటన తర్వాత గత నెల 7న హుస్నాబాద్ సభ ద్వారా ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాడు.
అనంతరం పార్టీ అభ్యర్థులు, మంత్రులు, ఎంపీలు ఎన్నికల ప్రచారంలో తలమునకలైనప్పటికీ వేర్వేరు కారణాల వల్ల టీఆర్ఎస్ అధినేత మాత్రం సభలకు విరామం ఇచ్చారు.తాజాగా కేసీఆర్ మళ్లీ ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నారు.
పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి జిల్లాల స్థాయిలో వరసగా ఏర్పాటు చేసిన ఐదు బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు.
బుధవారం నిజామాబాద్లో నిర్వహించనున్న తొలి బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.నిజామాబాద్ సభ తర్వాత 4న కేసీఆర్ నల్లగొండ బహిరంగ సభలో పాల్గొంటారు.5న వనపర్తి సభకు హాజరవుతారు.7న వరంగల్, 8న ఖమ్మం బహిరంగ సభల్లో పాల్గొంటారు.ఈ సభల కోసం జరుగుతున్న ఏర్పాట్లపై ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, పార్టీ అభ్యర్థులతో కేసీఆర్ రోజూ నేరుగా మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కేసీఆర్ బహిరంగ సభలతో తమ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి మరింత ఊపు వస్తుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.







