ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ రాజకీయ రణరంగం చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతోంది.ఏపీలో ప్రధానంగా టీడీపీ – వైసీపీ మధ్యే పోటీ తీవ్రంగా ఉంటుందని అందరూ అంచనాల్లో ఉన్నారు.
జనసేన పార్టీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటుందని అందరూ భావిస్తున్న తరుణంలో వైసీపీని మించిన దూకుడు జనసేన ప్రదర్శిస్తుండడం,అలాగే అన్ని పార్టీలకు ఎంతో కీలకమైన గోదావరి జిల్లాల్లో జనసేన పట్టు పెంచుకోవడం వైసీపీని కలవరపరుస్తోంది.అంతే కాదు ఇప్పుడు వైసీపీ నుంచి కీలకమైన గోదావరి నాయకులు పవన్ పార్టీ వైపు చూస్తుండడం జగన్ శిబిరం లో ఆందోళన పెంచుతోంది.
ఇటీవలే వైసీపీ నుంచి జనసేనలోకి సీనియర్ నాయకుడు, కాకినాడలో పట్టు ఉన్న ముత్తా గోపాలకృష్ణ చేరిపోయారు.ఆయన పార్టీ మారడమే వైసీపీకి పెద్ద దెబ్బగా భావిస్తున్న సమయంలో మరో కీలక నేత కూడా అదే బాటలో పయనించబోతున్నారు.కీలకమైన రాజమహేంద్రవరంలో మరో షాక్ తగలబోతోంది.గ్రేటర్ రాజమహేంద్రవరం వైసీపీ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న కందుల దుర్గేష్.జనసేనలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.జనసేనలో కి వెళ్ళబోతున్నట్టు కూడా అయన బహిరంగంగా ప్రకటించేశారు.
కొద్దీ రోజుల్లోనే పవన్ సమక్షంలో పార్టీలో చేరాలని ఆయన చూస్తున్నాడు. పోరు ఆసక్తికరంగా…
ప్రస్తుతం జగన్ చేసిన చిన్న చిన్న పొరపాట్లు జనసేనలోకి చేరికలు పెంచేలా చేస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, పెళ్లిళ్లపై జగన్ నోరు జారడం, కాపు రిజర్వేషన్ల విషయంలో రెండు రోజులకో యూటర్న్ తీసుకోవడం వంటి పరిణామాలు పార్టీలోని కొంత మంది నేతల అసహనానికి కారణం.అంతేగాక కాపు సామజిక వర్గానికి చెందిన వారికి ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి ఉండడం వైసీపీకి పెద్ద తలపోటుగా మారింది.
ఈ పరిణామాల ప్రభావం వైసీపీపై పడింది.కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో వీటి ఎఫెక్ట్ మొదలైంది.రాబోయే రోజుల్లో మరిన్ని వలసలు జనసేనలోకి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.అదే జరిగితే గోదావరి జిల్లాల్లో వైసీపీ బలహీన పడడం ఖాయం.