ప్రస్తుత రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అన్న మాటే కనిపించడంలేదు.ఏ పార్టీ కూడా దీనికి తీసిపోనట్టుగానే తయారయ్యాయి.
హుందాగా ఉండే రాజకీయాలు ఎప్పుడో కనుమరుగయ్యాయి.ఇప్పుడు రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే నోరు పెద్దదై ఉండాలనే ఒక అభిప్రాయానికి వచ్చేసారు.
ప్రత్యర్థి పార్టీల మీద ఒంటికాలి మీద లేస్తూ …నోటికి పని చెప్పి విరుచుకుపడిన వారికి పార్టీలో ప్రాధాన్యత మిగతా వారిని పక్కనపెట్టెయ్యడమే అన్నట్టుగా రాజకీయ పార్టీలు తయారయ్యాయి.ఎదురు వారి మనోభావాలు దెబ్బ తీస్తూ, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ రాజకీయాల స్వరూపమే మార్చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో ఈ ధోరణి తారాస్దాయికి చేరుకుంటోంది.రాయడానికి కూడా అవకాశం లేని బూతులు వాడుతున్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు సన్నాసులు, చేతకాని వాళ్లు , లుచ్చాగాళ్లు అంటూ కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేస్తున్నారు.కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్దాయిలో మాట్టాడడం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.
ఒకప్పుడు మర్యాదకు గౌరవాలకు స్దానం ఉన్న తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు రాజకీయాలు మరీ దారుణంగా మారాయి.
ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ పై చేస్తున్న వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉంటున్నాయి.
గజదొంగ , మోసగాడు అని తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు.దీనిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఖండించడంలేదు.
ఇప్పటికే రాజకీయాల పట్ల ప్రజలలో ఏహ్యభావం పెరిగింది.ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలు వ్యక్తిగత దూషణలు చూసి తెలుగు ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రారంభమైన ఈ తిట్ల దాడి తెలంగాణ వచ్చిన తర్వాత… ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మారలేదు.ఇక్కడి అధికార పార్టీ నాయకులే కాదు ప్రతిపక్షాలకు చెందిన వారు ఆ మాటకొస్తే నిన్న మొన్న పుట్టిన పార్టీల నాయకులు కూడా ఇదే భాషను వాడుతున్నారు.ఇలాంటి వ్యాఖ్యలు అప్పటికప్పుడు సభికులను ఆనందపరచవచ్చు కాని….ఆ తర్వాత వారిలో ఆలోచనలను రేకిత్తిస్తాయి.హుందా రాజకీయాలను ప్రోత్సహించకుండా ఇలా తిట్ల రాజకీయాలను ప్రోత్సహిస్తే ముందు ముందు పార్టీలే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.