టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొంచెం రిలాక్స్ అవుతున్నట్టు కనిపిస్తోంది.ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో పార్టీని పరుగులు పెట్టించాల్సిన ఆయన ఎందుకు రిలాక్స్ అయిపోయాడో అనే సందేహం కలిగిందా .? దానికి సమాధానం కూడా ఉంది.పార్టీలోనూ.
ప్రభుత్వంలోనూ దూసుకుపోతున్న కొడుకు కేటీఆర్ కు వచ్చే ఎన్నికల తరువాత కీలక పదవి అప్పగించే ఆలోచనలో ఉన్న కేసీఆర్ అందుకు ముందుగానే పార్టీని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను కూడా అప్పగించినట్టు తెలుస్తోంది.అలాగే మొదటి నుంచి తనకు చేదోడు వాదోడుగా ఉంటున్న మేనల్లుడు హరీష్ రావు కి కూడా అంటే సమానంగా బాధ్యత అప్పగించాలని కేసీఆర్ ప్లాన్ వేసుకుని మరీ తెలంగాణ ను రెండు భాగాలుగా చేసి సగం కేటీఆర్ , సంగం హరీష్ రావు చూసుకునే విధంగా సెట్ చేసాడట.
కేసీఆర్ పంపకాల్లో భాగంగా ఉత్తర తెలంగాణను కేటీఆర్, దక్షిణ తెలంగాణను హరీశ్ చూసుకోవాలని కేసీఆర్ సూచించినట్టు సమాచారం.గత ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ మంచి ఫలితాలే సాధించింది.దక్షిణ తెలంగాణలో మాత్రం అనుకున్న సీట్లను సాధించలేకపోయింది.ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ బాధ్యతను హరీశ్ పై పెట్టినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.దీంతో వీరిద్దరు ఆయా ప్రాంతాల్లో తరుచూ పర్యటిస్తూ హడావుడి చేస్తున్నారు.ప్రతి జిల్లాలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు హాజరవుతూ పార్టీని పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
కేటీఆర్, హరీష్ పర్యటనలతో క్యాడర్ లో ఉత్సాహం రావడమే కాకుండా, అభివృద్ధి పనులను కూడా వేగం చేస్తున్నారు.రోజూ ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఉత్తర తెలంగాణలోనే కేటీఆర్ ఎక్కువగా పర్యటిస్తున్నారు.దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎటూ కేటీఆర్ కనుసన్నల్లోనే ఉంది.గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటిచేత్తో కేటీఆర్ 99 సీట్లు సాధించడంతో ఆయనకే నగర బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. ఇక హరీశ్ రావు దక్షిణ తెలంగాణలో ఎక్కువగా పర్యటిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరీశ్ అక్కడే మకాం వేసి పనులు వేగవంతం అయ్యేలా చూస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో కాళేశ్వరం ప్రధాన అంశంగా మారనుంది.
దీంతో పాటు దక్షిణ తెలంగాణాలో హరీశ్ పర్యటనలు ఎక్కువగా జరుపుతున్నారు.కొడుకు, మేనల్లుడు సమర్ధవంతంగా తమకు అప్పగించిన పనులు చేస్తుండడంతో కేసీఆర్లో ధీమా పెరిగి రిలాక్స్ అయినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.
.