ఈ కేసులోని పలు చిక్కుముడులు ఇంకా వీడలేదు.అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు.
దర్యాప్తు కొనసాగేకొద్దీ ఆశ్చర్యకర అంశాలు బయటకొస్తున్నాయి.ఉత్తర దిల్లీలోని బురారీ ప్రాంతంలోగల ఓ ఇంట్లో భాటియా కుటుంబానికి చెందిన 11 మంది ఆదివారం విగతజీవులై కనిపించిన సంగతి తెలిసిందే.
భాటియా కుటుంబ సభ్యుల్లో ఎక్కువమంది మరణించే ముందు ఎలాంటి పెనుగులాటకు లోనుకాలేదని శవపరీక్ష నివేదికలు తేల్చాయి.మృతులందరి శవపరీక్షలు సోమవారం పూర్తయ్యాయి.
వృద్ధురాలు నారాయణ్ దేవి, ఇద్దరు బాలురు సహా ఎనిమిది మంది మరణించే ముందు పెనుగులాటకు లోనైన సంకేతాలేవీ లేవని వైద్యులు తెలిపారు.వారంతా ఉరి వల్లే మరణించారని స్పష్టం చేశారు.
బలవంతంగా ఇతరులు గొంతునులమడంతో మృత్యువాతపడ్డ దాఖలాలేవీ లేవని తెలిపారు.

అయితే నారాయణ దేవి కుటుంబ సభ్యులను వారి ఇంట్లో చివరిసారిగా చూసిన డెలివరీ బాయ్ రిషి చెప్పిన విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.‘మంగళవారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు 20 చపాతీల కోసం వారు ఆర్డర్ చేశారు.10 గంటల 45 నిమిషాల ప్రాంతంలో చపాతీలు ఇచ్చేందుకు వారి ఇంటికి వెళ్లాను.వాళ్లలో ఒక మహిళ తన తండ్రిని నాకు డబ్బులు ఇవ్వాల్సిందిగా చెప్పింది.నేను వెళ్లిన సమయంలో ఇళ్లంతా సందడిగా ఉంది.వారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అసలు ఎవరూ ఊహించనే లేరంటూ’ రిషి వాపోయాడు.మరికొన్ని గంటల్లో చనిపోతామని తెలిసి కూడా వారంతా అలా ఉండటం తనను విస్తుగొలిపిందని అతడు తెలిపాడు.
కాగా నారాయణ దేవి ఇంట్లోని రెండు రిజిస్టర్లలో లభ్యమైన కాగితాల్లో మోక్షం పొందాలంటే చనిపోయే రోజు ఇంట్లో భోజనం వండకూడదని వారు పెట్టుకున్న నియమం ప్రకారమే చపాతీలను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది.
