ఏపీ లోని తాడేపల్లి మండలం పెనుమాక లో ఏపీ సి ఎం జగన్మోహన్ రెడ్డి రాజన్న బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.పెనుమాక లోని వందేమాతరం హైస్కూల్ లో విద్యార్థులకు జరిగే సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు.
చిన్నారుల్ని తన ఒడిలో కూర్చొబెట్టుకొని పలకా బలపం పట్టి అక్షరాలు దిద్దించారు.ఈ కార్యక్రమానికి పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.
పిల్లలందరికీ విద్య అందించడమే లక్ష్యం తో ఏపీ సి ఎం జగన్ ఈ రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
పిల్లల భవిష్యత్కు భరోసా ఇచ్చేటట్లు విశ్వాసాన్ని కలిగించటానికి ‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’ అనే నినాదంతో ఏపీ సర్కార్ ఈ రాజన్నబాట నిర్వహిస్తోంది.ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో సీ ఎం జగన్ తో పాటు విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్, మంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.ప్రయివేట్ స్కూల్స్ లో వేలకు వేలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు అప్పులపాలు అవ్వకూడదు అని అందుకే ప్రభుత్వ పాఠశాల లో అన్నీ వసతులతో విద్యను అందిస్తామంటూ జగన్ వ్యాఖ్యానించారు.
ప్రధానంగా రాజన్న బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది స్కూల్ ప్రారంభించేనాటికే విద్యార్థులకు సంబంధించి 19.85 లక్షల పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో భాగంగా విద్యార్థులకు మూడు జతల యూనిఫాం తో 2,51,601 మందికి బూట్లు, రెండు జతల సాక్సులు కూడా అందిస్తున్నట్లు తెలుస్తుంది.
అలానే 8, 9 తరగతులు చదివే బాలికలకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయడం తో పాటు పదోతరగతిలో ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులను సత్కరించాలన్నా కార్యక్రమాలను కూడా నిర్వహించాలని విద్యాశాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలుస్తుంది.