పిల్లలు చేసే అల్లరి ఒక్కోసారి శృతి మించుతుంటుంది.అలాంటి సందర్భాల్లో పెద్దలు వారిని మందలిస్తుంటారు.
ఒక్కోసారి వారిని కొన్ని దెబ్బలు కొట్టి అయినా అదుపు చేస్తుంటారు.అయితే కొన్ని సంఘటనల్లో పెద్దలు షాక్ అవుతుంటారు.
పిల్లలను ఏం అనాలో కూడా వారికి అర్ధం కాదు.అంతలా పిల్లలు చేసే అల్లరి ఉంటుంది.
ఇదే తరహాలో ఓ బాలుడు కొంటె పని చేశాడు.జ్వరం వచ్చిందని బాలుడిని అతడి తండ్రి ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
జ్వరం తగ్గగానే ఆసుపత్రిలో కనిపించిన అంబులెన్స్ను ఎత్తుకుపోయాడు.చివరికి పోలీసులు పెద్ద ఎత్తున గాలించి, అతడిని వెంబడించి పట్టుకున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
కేరళలోని త్రిసూర్ జనరల్ హాస్పిటల్లో సోమవారం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.13 ఏళ్ల బాలుడు త్రిసూర్ జనరల్ హాస్పిటల్ ముందు ఆగి ఉన్న అంబులెన్స్ను దొంగిలించాడు.దానిని 8 కిలోమీటర్లు నడిపాడు.
సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఆసుపత్రిలో పని చేసే ఉద్యోగి కుమారుడు, గత నాలుగు రోజులుగా జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అతడికి వైద్యులు తగిన చికిత్స అందించడంతో క్రమంగా కోలుకుంటున్నాడు.

ఈ తరుణంలో అంబులెన్స్ డ్రైవర్ బిజో వాహనం లోపల కీ వదిలేసి వాటర్ తాగేందుకు పక్కకు వెళ్లాడు.అంబులెన్స్లో కీ ఉండడం చూసిన ఆ బాలుడు వెంటనే అందులోకి ఎక్కాడు.క్షణాల్లో అక్కడి నుంచి అంబులెన్స్ను నడుపుకుంటూ 8 కిలోమీటర్లు వెళ్లిపోయాడు.
అంబులెన్స్ డ్రైవర్ స్థానంలో బాలుడు ఉండడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.పోలీసులకు సమాచారం అందించారు.
ఈ లోపు అంబులెన్స్ డ్రైవర్ కూడా అంబులెన్స్ మాయం అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో పోలీసులు అంబులెన్స్ ను వెంబడించి పట్టుకున్నారు.
బాలుడిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు.ఈ ఘటన బయటకు తెలియగానే బాగా వైరల్ అవుతోంది.