ఏపీలో ఎన్నికలు ఎప్పుడు రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు గా ఉంటాయి.రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో అయితే ఎన్నికలు ఎప్పుడు కూడా రక్తపాతం సృష్టిస్తుంటాయి.
ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన వర్గం ఓడిపోయిన వారిపై దాడులు చేయడం మొదలుపెడుతుంది.గతంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ వారు చేసిన దారుణాలు ప్రతీకారంగా తిరిగి దాడులు చేయడం మొదలుపెడతారు.
ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఇదే వాతావరణం నెలకొని ఉంది.తాజాగా వైసీపీ అధికారంలోకి రావడంతో గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో టీడీపీకి చెందిన 100 కుటుంబాలు భయంతో గ్రామం గురించి వెళ్లిపోయారు.
ప్రస్తుతం తిరిగి వారు గ్రామాలకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.ఊళ్లో అడుగుపెడితే చంపేస్తామంటూ వైసిపి వర్గీయులు బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు భయంతో తో పోలీసులను ఆశ్రయించారు.
ఎన్నికల ఫలితాలు రోజు ఆ గ్రామంలో 20 మంది టిడిపి కార్యకర్తలని వైసీపీ వర్గీయులు దాడి చేసి గాయపరిచారు.దీంతో ఆ గ్రామంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం చల్లబడాలంటే టిడిపి వర్గం వారు గ్రామం విడిచి వెళ్లాలని పోలీసులు చెప్పడంతో తప్పనిసరి పరిస్థితిలో వారు బయటికి వెళ్లి కొద్దిరోజులు తలదాచుకున్నారు.
మళ్లీ గ్రామాలకు వచ్చే ప్రయత్నం చేస్తే తమని వైసిపి కార్యకర్తలు చంపేస్తామని బెదిరిస్తున్నారని ఇప్పుడు టిడిపి వర్గానికి చెందినవారు భయపడుతున్నారు.అలాగే తమకు చెందిన పంట పొలాలను కౌలుకు ఇద్దామని ప్రయత్నించినా కూడా వైసిపి వర్గానికి చెందినవారు కౌలు తీసుకునే వారిని బెదిరిస్తున్నారని తమకు రక్షణ కల్పించాలంటూ ఆ గ్రామానికి చెందిన 100 మందికి పైగా టిడిపి కార్యకర్తలు గుంటూరు రూరల్ ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.
దీంతో ఇప్పుడు ఈ ఘటన రాజకీయంగా ఏపీలో సంచలనంగా మారింది.







