ఉన్నతాధికారులే అవినీతికి కొమ్ముకాస్తే ఆపేదెవరు?

సూర్యాపేట జిల్లా:“ప్రజావాణిలో” ప్రభుత్వ భూమిని కాపాడాలంటే,తప్పుడు సమాచారంతో మోసం చేసిన అదనపు కలెక్టర్,ఏం ఆశించి,ఎవరి మెప్పు కోసం అధికారులు ఇదంతా చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని ఓ సామాజిక తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.పట్టణ నడి బొడ్డున ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో ఓ సామాజిక కార్యకర్త జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే సాక్షాత్తు జిల్లా అదనపు కలెక్టర్ తప్పుడు సమాచారంతో వాస్తవాలను పక్కదారి పట్టించిన ఉదంతం సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.కోదాడ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త పొడుగు హుస్సేన్ కథనం ప్రకారం… అప్పటి నేషనల్ హైవే 9పై కోదాడ పట్టణ నడిబొడ్డున సర్వే నెంబర్ 149 లో 3.06 ఎకరాల భూమిని ఎన్.ఎస్.పి.అవసరాలకు 1959 లో భూ సేకరణ ద్వారా తీసుకొన్నారు.ఇదే సర్వే నెంబర్ లో 2.00 ఎకరాల భూమిని ప్రభుత్వ హాస్పిటల్ కు దానపత్రం నెంబర్ 267/1963 ద్వారా పట్టాదారు ఇచ్చారు.మిగిలిన భూమిని డిటిపిసి నెంబర్ సీఆర్ 182/42/64 ద్వారా ప్లాట్లుగా లే ఔట్ చేసుకొని అమ్ముకొన్నారు.కానీ,రెవెన్యూ అధికార్లు 1986 లో సదరు విస్తీర్ణం మొత్తం 8.27 ఎకరాల భూమిని పట్టణానికి చెందిన నాగుబండి వీరయ్య పేరుతో మ్యూటేషన్ చేసి,పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారు.వాటి ఆధారంగా ఆయన వారసులు దానం ఇచ్చిన ప్రభుత్వ భూమిని,హాస్పిటల్ స్తలాన్ని బ్యాంక్ లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు.అంతటితో ఆగకుండా ఆ ప్రభుత్వ భూమిని ఏకంగా ఇతరులకు అమ్ముకొని రిజిస్ట్రేషన్లు కూడా చేశారు.

 If The Bosses Are The Ones Who Stop The Corruption?-TeluguStop.com

ఈ విషయం వివాదంగా మారగా పట్టాదారు వారసులు,1960 నాటి ప్రభుత్వ అధికార్లు తమ స్తలాన్ని కాజేశారని ఫిర్యాదు చేశారు.దీనితో రాష్ట్ర సర్వే & లాండ్ రికార్డ్స్ స్పెషల్ కమిషనర్,ఎన్.

ఎస్.పి.ఎస్ఈ, ఈఈ,ఏఈ,జేసీ,ఆర్డీవో,తహశీల్దార్ వగైరా 11 మంది అధికారులతో తేదీ:16.11.2000 న జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు.ఆ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా వారి భూమిని ఎక్కడా కాజేయలేదని, కోర్ట్ ధిక్కరణ కేసుకి అధికార్లు అవకాశమిచ్చారని, బాధులపై చర్యలు తీసుకోవాలని రిపోర్ట్ ఇచ్చింది.

బాధ్యులపై చర్యలు తీసుకోవడం మాట దేవుడెరుగు, అధికారులే భూమిని కాజేశారని తప్పుడు ఫిర్యాదు ఇచ్చినవారి కోసం అధికారులు ఇచ్చిన జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ నే మాయం చేసి,కోర్ట్ ధిక్కరణ కేసుకి‘స్టే’ఇవ్వటాన్ని మరుగున పెట్టి,సదరు ఎన్.ఎస్.పి భూమిని రెవెన్యూ శాఖకి బదిలీ చేసినప్పటికీ,జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ లేకుండా ఆఘమేఘాలపై స్తలంలో ఎన్ హెచ్ 9 పై నైరుతీ మూలన కాజేశామని అంగీకరిస్తూ,1960 నాటి ఎన్.ఎస్.పి.సిబ్బంది క్వార్టర్స్ ని కూల్చేసి, సంబంధం లేని సర్వే నెంబర్149/1 లో 15 కుంటలు అప్పగిస్తే,కొనుగోలుదార్లు సర్వే నెంబర్149 లో 7 అంతస్తుల భవనం నిర్మాణం చేశారు.ఈ వాస్తవాలు మున్సిపాలిటీ వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా మున్సిపల్ అధికారులు నిర్మాణ అనుమతులు ఇచ్చారు.ఇక్కడ వింత గొలిపే అంశం ఏమిటంటే ఇదే సర్వే నెంబర్ 149 లోని ప్రభుత్వ హాస్పిటల్ స్తలాన్ని ఆగ్నేయ మూలన కాజేసినట్లు అంగీకరిస్తూ 530 చ.గ.లు అప్పగించారు!ఇక ఇప్పటి అధికార్లు,అప్పటి అధికార్లు ఒకే సర్వే నెంబర్లో,ఒకే కాలంలో,ఎన్.ఎస్.పి.స్తలాన్ని ఆనుకొని ఎన్ హెచ్9 పై నైరుతి మూలన,హాస్పిటల్ స్తలాన్ని ఆనుకొని ఎన్ హెచ్9 పై ఆగ్నేయ మూలన ఆక్రమించినట్లు నిర్ధారించి,కోట్ల విలువైన స్తలాన్ని అప్పగించారు.పై అక్రమాలను తెలుపుతూ తేదీ: 29.05.2019 న చేసిన ఫిర్యాదును పురస్కరించుకొని కలెక్టర్ నెంబర్ ఇ1/526/2019 ననుసరించి జేసీ అధ్యక్షతన కమిటీ వేశారు.ఆ కమిటీ తేదీ:03.06.2019 సమావేశమైంది.ఈ సమావేశంలో తాను సమర్పించిన ఆధారాలతో సంతృప్తి చెందిన కమిటీ ఛైర్మన్,సర్వే నెంబర్ 149లో జరుగుతున్న నిర్మాణాలను నిలిపేయాలని మున్సిపల్ కమిషనర్ ను,ఏడి సర్వేను వెంటనే సర్వే చేసి నివేదించాలని ఆదేశించారు.

కానీ,అక్రమ నిర్మాణం ఆగలేదు,ఏడి సర్వే చేయలేదు,కమిటీ తిరిగి సమావేశం కాలేదు.ఎలాంటి చర్యలు లేకుండానే 3 ఏళ్ళు గడిచిపోయాయి.ఈ పరిస్తితిని వివరిస్తూ తేదీ: 08.02.2021 న కలెక్టర్ ని స్వయంగా కలిసి ఫిర్యాదు చేయగా కలెక్టర్ ఆర్డీవోకు స్పీక్ (speak) అని ఎండార్స్ చేశారు.దీనిపై ఆర్డీవోని ఎన్నో సార్లు కలిసినప్పటికీ (speak )స్పీక్ చేయను,కలెక్టర్ కి చెప్పుకో పో’అంటూ హేళనగా,ఎగతాళిగా దుర్భాషాలాడుతున్నారని పొడుగు హుస్సేన్ ఆవేదన చెందుతూ తేదీ:31.03.2021న,22.07.2021 న 13.08.2021న,07/1/2021న ఫిర్యాదులు చేయగా,అడిషనల్ కలెక్టర్ గత సంవత్సర కాలంగా ఇదిగో,అదిగో లేఖ పంపుతామంటూ మభ్యపెడుతున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేదీ:21.03.2022 న ప్రజావాణిలో బాధ్యులైన అధికార్లు అందరితో సమావేశం జరుగుతుందని ఎదురుచూడగా అది కూడా జరగలేదని,సుదీర్గ కాలంగా ఏడి సర్వే వద్ద పెండింగ్ ఉన్నదని,తమరు గతంలో ఆర్డీవోతో ఫోన్ లో మాట్లాడినప్పుడు వారు అదే చెప్పారని మనవి చేస్తూ,ఏడిని పిలిచి మాట్లాడాలని కోరాను.కానీ,ఏడీ క్యాంపులో ఉన్నారని నన్ను తప్పు దోవ పట్టించి, యదాలాపంగా ఏదో ఎండార్స్ చేసి పొమ్మన్నారు.

చాలా కాలంగా కాలయాపన చేస్తున్నారని,నేను సంర్పించిన ఆధారాలను ఫైల్ లో లేకుండా చేశారని, వాటిని తిరిగి సమర్పిస్తున్నాని మనవి చేశానని చెప్పాను.విషయ ప్రాధాన్యతా క్రమములో పని చేస్తామంటూ సెలవిచ్చారని,ప్రభుత్వ భూములను కాపాడే ఫిర్యాదుకి సంవత్సరాలు గడిచినా ప్రాధాన్యత లేదనడం వారి నిబద్దతకు అద్దం పడుతుందని అన్నారు.

అంటే,ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనే ఫిర్యాదీలను తిప్పి తిప్పి నిరాశపర్చి ఫైల్ మూలన పడేసే దుర్మార్గంగా తెలుస్తుందని,సత్వరం పరిష్కరించే ప్రత్యేక ప్రజావాణిలో ఈ విధమైన ప్రవర్తన అడిషనల్ కలెక్టర్ కి తగింది కాదని అన్నారు.ఆ వెంటనే ఏడి సర్వేని ఆఫీసులో కలిస్తే,మూడు సంవత్సరాల తర్వాత,కమిషనర్ & లాండ్ సర్వే కమిషనర్ సర్వే రిపోర్ట్ కి భిన్నంగా సర్వే చేయడం సముచితం కాదని కలెక్టర్ కి నివేదించినట్లు తెలిపారన్నారు.

కనుక ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube