ఉత్తరప్రదేశ్లోని( Uttar Pradesh ) గోండాకు చెందిన ఓ మహిళకు భర్త ఊహించని షాక్ ఇచ్చాడు.ఆమె ఇటీవల సోదరుడికి కిడ్నీ దానం( Kidney Donation ) చేసింది.
ఈ విషయాన్ని భర్త తెలుసుకొని తర్వాత వాట్సాప్ ద్వారా విడాకులు ఇచ్చాడు. సౌదీ అరేబియాలో( Saudi Arabia ) ఉద్యోగం చేస్తున్న భర్త మొదటగా ఆమె నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.40 లక్షలు అడిగాడు.ఆమె నిరాకరించడంతో ఇటీవల తలాక్, తలాక్, తలాక్ అంటూ మెసేజ్ పంపాడు.
వివరాల్లోకి వెళ్తే, తరన్నమ్( Tarannum ) అనే మహిళకు మహ్మద్ రషీద్తో 20 ఏళ్ల క్రితం వివాహమైంది.వీరికి పిల్లలు లేకపోవడంతో రషీద్( Rashid ) సౌదీ అరేబియాలో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.
తరన్నమ్ సోదరుడు మొహమ్మద్ షకీర్కి కిడ్నీ ఫెయిల్యూర్తో మార్పిడి చేయాల్సి వచ్చింది.ఆమె తన కిడ్నీలలో ఒకటి అతనికి ఇవ్వడానికి అంగీకరించింది.ఐదు నెలల క్రితం ముంబైలో శస్త్రచికిత్స చేయించుకుంది.

శస్త్రచికిత్స తర్వాత, ఆమె తిరిగి గోండాలోని( Gonda ) తన అత్తమామల ఇంటికి వెళ్లింది.అక్కడ భర్త నుంచి ఫోన్లో వేధింపులు అనుభవించింది.తనకు బిడ్డను ఇవ్వలేదని అలా సరిపెట్టుకున్నా, ఇప్పుడు కిడ్నీని తనకు తెలియకుండా ఎవరికో ఇచ్చేశావ్ అంటూ ఆమెపై భర్త విరుచుకుపడ్డాడు.తరువాత ఆమె ఇవ్వలేని రూ.40 లక్షలు డిమాండ్ చేశాడు.ఆ తర్వాత ఆమెకు ట్రిపుల్ తలాక్( Triple Talaq ) సందేశం పంపి పెళ్లిని ముగించాడు.

తరన్నమ్ అతని చర్యలకు షాక్ అయింది, భర్త విడాకులు ఇచ్చాక ఎంతో బాధపడింది.ఆమె తన అత్తమామల ఇంటిని వదిలి తల్లిదండ్రుల వద్దకు వెళ్లవలసి వచ్చింది.భారతదేశంలో చట్టవిరుద్ధమైన ట్రిపుల్ తలాక్ చెప్పినందుకు ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.తరన్నమ్కు న్యాయం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ రాధేశ్యామ్ రాయ్ ధృవీకరించారు.
రషీద్ను పట్టుకునేందుకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తామని చెప్పారు.







