ఏపీలో పొత్తుల అంశంపై మరోసారి క్లారిటీ ఇచ్చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan ). వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని, మరోసారి ఏపీ సీఎం గా జగన్ ఉండకూడదనే తన అభిప్రాయాన్ని బయటపెట్టేసారు.
దీనికోసం టిడిపి, బిజెపితో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ చెబుతున్నారు.విపక్షాల ఓట్లు చీలకుండా ఉండాలన్నదే తమ పార్టీ విధానం అని, అందుకే 2014 మాదిరిగానే టిడిపి, బీజేపీలను కలుపుకుని ఎన్నికలకు వెళ్తామని పవన్ చెబుతున్నారు .అప్పటి ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేసినా, 2019లో విడిపోయామని, మళ్లీ బిజెపి జనసేన కలిసినా, టిడిపి , బిజెపి మధ్య ఇంకా ఏక అభిప్రాయం కుదరలేదని పవన్ చెబుతున్నారు .టిడిపి, బిజెపి మధ్య ఉన్న సమస్యలపై తాను స్పందించడం సరికాదని వ్యాఖ్యానించారు.ఇక సీఎం అభ్యర్థిగా ఎవరు ఉండాలనే దానిపైన స్పందించారు.ఎన్నికల సమయంలోనే దీనిపై క్లారిటీ వస్తుందని, తమ లక్ష్యం మాత్రం వైసిపిని ఓడించడమేనని పవన్ చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఎప్పటి నుంచో టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ ఇప్పటికే తమతో పొత్తులో ఉన్న బిజెపి మాత్రం టిడిపిని దూరం పెడుతూనే వస్తోంది.ఆ పార్టీతో గతంలో ఎదురైన అనుభవాలను బిజెపి గుర్తుచేసుకుని ఆ గ్యాప్ ను కొనసాగిస్తుంది.కానీ పవన్ మాత్రం టీడీపీతో కలిసి వెళ్తేనే వచ్చే ఎన్నికల్లో వైసిపిని ఓడించడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు .అందుకే బీజేపీ అగ్రనేతలను సందర్భం వచ్చినప్పుడల్లా , టిడిపి తో పొత్తు అంశాన్ని ప్రస్తావిస్తూ, వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా, బిజెపి అగ్ర నేతలు మాత్రం ఈ విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు.కానీ వచ్చే ఎన్నికల సమయం నాటికి బీజేపీని ఒప్పించి టిడిపిని తమతో కలుపుకుని వెళ్లగలము అనే నమ్మకంతో పవన్ ఉన్నారు.

వైసిపికి ఉన్న బలం దృష్ట్యా బిజెపి( BJP party ) జనసేన కలిసి పోటీ చేసినా ఉపయోగం ఉండదని ,టిడిపిని కలుపుకు వెళ్తేనే అది సాధ్యమవుతుందనే విషయాన్ని బిజెపి పెద్దలకు అర్థమయ్యేటట్లు చెప్పి , ఏదో రకంగా వారిని ఒప్పించగలననే నమ్మకంతో పవన్ ఉన్నారు.టిడిపి, చంద్రబాబు సైతం పవన్ పైనే ఆశలు పెట్టుకున్నారు.బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకునే విధంగా పవన్ మాత్రమే బీజేపీ అగ్ర నేతలను ఒప్పించగలరని చంద్రబాబు నమ్మకంతో ఉన్నారు.







