ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగా తీవ్ర ఆరోపణలు చేశారు.రెడ్డి సామాజిక వర్గం వైఎస్ జగన్ పాలనలో ఇబ్బంది పడుతుందని నారా లోకేశ్ అంటున్నారు.
జగన్ సీఎం అయ్యాక కేవలం నలుగురు ( జగన్, సజ్జల, పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి) మాత్రమే బాగుపడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు.ఎవరి ప్రభుత్వ హయాంలో రెడ్డి సామాజిక వర్గం వేధింపులకు గురి అయింది.? లోకేశ్ చేస్తున్న ఆరోపణలు వాస్తవమా.? అవాస్తవమా.? అసలు రెడ్లను వేధించింది ఎవరు.? ఒక్కసారి ఆలోచిస్తే.
చిన్న చిన్న కాంట్రాక్టర్లుగా ఉన్న రెడ్డిలను జగన్ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీల పేరుతో ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు.ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వారిని తీసుకొచ్చిందన్నారు.జగన్ పాలనలో నష్టపోయింది రెడ్డిలేనని, టీడీపీ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజికవర్గంలోని పేదలకు ఆదుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.దాంతో పాటు రెడ్డి భవన్ ఏర్పాటుకు సహకరిస్తామని స్పష్టం చేశారు.
అయితే, ఇన్ని మాట్లాడిన లోకేశ్ ఒకసారి గతంలోని టీడీపీ ప్రభుత్వ హయాంలో రెడ్డి సామాజిక వర్గం వారిని, అధికారులను ఏ విధంగా వేధింపులకు గురి చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని పలువురు చెబుతున్నారు.దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నారని అప్పటి విద్యుత్ సంస్థ ఛైర్మన్ రమాకాంత్ రెడ్డిని వేధించడం మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ సర్కార్ చూపించిన కుల వివక్ష కారణంగా సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీపీ ఆంజనేయ రెడ్డి, ఐపీఎస్ దినేశ్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డి వంటి అధికారులు ఇబ్బందులు పడిన విషయం అందరికీ తెలిసిన నిజం.ఇవే కాకుండా చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిని అక్రమ కేసులలో ఇరికించడమే కాకుండా పోలీస్ వ్యానులో కింద పడేసి కిలోమీటర్ల మేర తిప్పి కొట్టిన ఘటన ఇలా చెప్పుకుంటూ పోతే అప్పటి టీడీపీ ప్రభుత్వం నేతలు వేధించిన రెడ్డి అధికారుల లిస్ట్ చాలానే ఉందనేది జగమేరిగిన సత్యం.
ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావాలనే రెడ్లపై ప్రేమ కురిపించడం.తరువాత వారిపై దారుణంగా దాడులు చేయించేది ఎవరో తెలుసుకోలేనంత అమాయక స్థితిలో ప్రజలు లేరు.
అంతెందుకు ఇప్పుడు రెడ్డిల కోసం ఇంత చేస్తామని ప్రేమ చూపుతున్న లోకేశ్, ఆయన తండ్రి చంద్రబాబు గతంలో అధికారులనే కాకుండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎలా టార్గెట్ చేసి వేధించారో ప్రజలందరికీ తెలిసిన విషయమే.అయితే వీటన్నింటిని లోకేశ్ మర్చిపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది.
అధికారంలోకి రావడానికి బూటకపు మాటలు, ప్రేమను చూపిస్తున్నారని తెలుస్తోంది.