అగ్రరాజ్యంగా, ప్రపంచ పెద్దన్నగా, అత్యంత సంపన్న దేశమైన అమెరికాలో నల్లజాతీయుల పట్ల నేటీకీ వివక్ష కొనసాగుతుండటం సిగ్గుచేటు.శతాబ్దాలుగా అమెరికా సమాజంలో భాగమైన నల్లజాతీయులు నేటీకీ అక్కడ ద్వీతీయ శ్రేణి పౌరులుగా జీవిస్తున్నారనడానికి ఎన్నో ఉదాహరణలు.
ఇక రెండేళ్ల క్రితం జరిగిన జార్జి ఫ్లాయిడ్ హత్య అయితే ఇందుకు నిలువెత్తు నిదర్శనం.ఫ్లాయిడ్ను ఓ తెల్లజాతి పోలీసు కర్కశంగా హతమార్చిన తీరు సమాజాన్ని నివ్వెరపరిచింది.
ఈ ఘటనను యావత్ ప్రపంచం నిరసించింది.న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, జార్జియా, ఇల్లినాయిస్, నార్త్ కరోలినా, మిచిగాన్, మేరీలాండ్, లూసియానా, తదితర రాష్టాల్లో నల్లజాతీయులు అధికసంఖ్యలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో నల్లజాతీయులు తలెత్తుకుని నిలబడగలిగే ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలిసారి నల్లజాతి మహిళకు అవకాశం దక్కింది.
ఈ మేరకు కరీన్ జీన్ పియర్ను నియమిస్తూ జో బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.తద్వారా ఈ పదవిని చేపట్టనున్న తొలి నల్లజాతి వ్యక్తిగా , తొలి LGBTQ+ వ్యక్తిగా కరీన్ రికార్డుల్లోకెక్కారు.
ప్రస్తుతం వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న జెన్సాకీ పదవీకాలం ఈ నెల 13తో ముగియనుంది.ఇప్పటి వరకు జీన్ పియర్ ఆమెకు డిప్యూటీగా ఉన్నారు.
44 ఏండ్ల జీన్ పియర్.2008, 2012లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు, 2020లో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ తరఫున ప్రచారం నిర్వహించారు.జెన్సాకీ అందుబాటులో లేని సమయాల్లో జీన్ పియర్ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్ బాధ్యతలు తీసుకునేవారు.అలాగే అధ్యక్షుడు బైడెన్ ఎయిర్ఫోర్స్ వన్లో ప్రయాణిస్తున్నప్పుడు రిపోర్టర్లతో తరచుగా ముచ్చటించేవారు .ఇటీవల జెన్సాకీ కోవిడ్ 19 బారినపడటంతో జెన్సాకీకి బదులుగా జీన్ పియర్ బైడెన్తో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లారు.

కరీన్ నియామకం పట్ల బైడెన్ ఒక ప్రకటన ద్వారా స్పందించారు.ఈ క్లిష్టమైన పనికి అవసరమైన అనుభవం, ప్రతిభ ఆమెకు వున్నాయని చెప్పారు.ఇకపోతే.
ప్రస్తుత ప్రెస్ సెక్రటరీ జెన్సాకీ మాట్లాడుతూ.ఆమె చాలా మందికి గొంతుకగా మారబోతోందన్నారు.
ఇది ఒక చారిత్రాత్మకమైన క్షణమని జెన్సాకీ పేర్కొన్నారు.ఈ సందర్భంగా తన వారసురాలిని ఆమె అందరికీ పరిచయం చేయగా.
వైట్హౌస్ సిబ్బంది చప్పట్లతో అభినందించారు.







