అమెరికాకు వచ్చే వలసదారులకు బైడెన్ ప్రభుత్వం షాకిచ్చేందుకు సిద్ధమైంది.ఇమ్మిగ్రేషన్ రుసుములను భారీగా పెంచాలని ప్రతిపాదించింది.
ఇందులో హెచ్ 1 బీ సహా తదితర వీసాలు వున్నాయి.యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) బుధవారం ప్రతిపాదిత వివరాలను వెల్లడించింది.
హెచ్ 1బీ వీసా దరఖాస్తు రుసుమును 460 అమెరికా డాలర్ల నుంచి 780 డాలర్లకు పెంచింది.ఎల్ 1 వీసా దరఖాస్తు రుసుము 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు పెంచింది.O1 వీసా దరఖాస్తు రుసుమును 460 డాలర్ల నుంచి 1,055 డాలర్లకు పెంచాలని, హెచ్ 2 బీ పిటిషన్ల రుసుమును (సీజనల్ , వ్యవసాయేతర కార్మికులు) 460 డాలర్ల నుంచి 1,080 డాలర్లకు పెంచాలని యూఎస్సీఐఎస్ ప్రతిపాదించింది.
ఇమ్మిగ్రేషన్, నేచురలైజేషన్ బెనిఫిట్ రిక్వెస్ట్ల కోసం దరఖాస్తుదారులు/ పిటిషన్దారుల నుంచి వసూలు చేసే రుసుము ద్వారా యూఎస్సీఐఎస్ నిధులు సమకూర్చుకుంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)తన ఫెడరల్ నోటిఫికేషన్లో తెలిపింది.
శరణార్ధులు, ఆశ్రయం కోరుతున్న వారు, ఇతర దరఖాస్తుదారులకు రుసుము విషయంలో మినహాయింపు వున్న సంగతి తెలిసిందే.రుసుము పెంపు ప్రతిపాదనపై 60 రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ఆ తర్వాత అమలు చేస్తామని డీహెచ్ఎస్ తెలిపింది.
కొత్త రుసుముల వల్ల యూఎస్సీఐఎస్ తన నిర్వహణ ఖర్చులను పూర్తిగా రికవరీ చేసుకోవడంతో పాటు, సకాలంలో దరఖాస్తులను ప్రాసెసింగ్ జరుపుకోవడానికి, భవిష్యత్తులో బ్యాక్లాగ్లు పేరుకుపోకుండా నిరోధించగలుగుతుంది.యూఎస్సీఐఎస్ తన నిధులలో దాదాపు 96 శాతం ఫీజుల ద్వారానే పొందుతుంది తప్పించి, కాంగ్రెస్ కేటాయింపుల ద్వారా కాదు.2016 నుంచి ఫీజులు పెంచుకోవాలని యూఎస్సీఐఎస్ భావిస్తోంది.మరోవైపు ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల రుసుము పెంపుదల ప్రతిపాదనపై పలువురు రాజకీయ, ఆర్ధిక నిపుణులు పెదవి విరుస్తున్నారు.
రుసుము పెంపుదల వల్ల మరింత మంది వలస కార్మికులు, వ్యక్తులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అటు రుసుము పెంపువల్ల భారతీయులకు ఇమ్మిగ్రేషన్ ఖర్చుల భారం పెరగనుంది.