తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా ఉన్నారు.ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బిజెపి సత్తా చాటడంతో, దేశవ్యాప్తంగా బిజెపికి ఇక ఎదురే లేదని, తెలంగాణలోనూ బిజెపి అధికారంలోకి వస్తుందనే నమ్మకం సంజయ్ లో బాగా పెరిగింది.
అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని , అదే తమను అధికారంలోకి తీసుకు వస్తుందని సంజయ్ బలంగా నమ్ముతున్నారు.ఇక కాంగ్రెస్ ప్రభావం తెలంగాణలో పెద్దగా లేకపోవడంతో, ఇక తమకు ఎదురేలేదనేది సంజయ్ అభిప్రాయం.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 14వ తేదీ నుంచి రెండో విడత పాదయాత్రను జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి ప్రారంభించేందుకు సంజయ్ సిద్ధమవుతున్నారు.
ఈ పాదయాత్ర ప్రారంభోత్సవానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హాజరు కాబోతున్నారట.
దీంతో కేంద్ర బిజెపి పెద్దలు తెలంగాణ పై ఏ స్థాయిలో ఫోకస్ పెట్టారనే విషయం అర్థమవుతోంది.ఈ పాదయాత్ర తో పాటు త్వరలోనే జనగామ జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
దీనిని ఈ నెల చివరిలో కానీ , లేక వచ్చే నెల మొదటి వారంలో కానీ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ భారీ బహిరంగ సభకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కాబోతున్నట్లు బిజెపి వర్గాలు పేర్కొంటున్నాయి. రెండో విడత పాదయాత్ర ద్వారా మరింతగా జనంలోకి వెళ్లాలని క్షేత్రస్థాయిలోకి బిజెపి ని తీసుకువెళ్లి కేంద్రం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల కు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను హైలెట్ చేయాలని సంజయ్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక వరుసగా బిజెపి అగ్రనేతలు అంతా తెలంగాణ లో పర్యటనలు చేయబోతున్నారట.తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బిజెపి అగ్రనేతలు ఉండడంతో, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో పాటు, కేంద్ర మంత్రులు, పార్టీ కీలక నాయకులు ఇక వరుసగా తెలంగాణలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అధికారం దక్కకుండా బీజేపీ అధికారం సాధించే విధంగా ఏం చేయాలనే విషయంపై ఎప్పటికప్పుడు బిజెపి అగ్రనాయకులు సంజయ్ కు తగిన సూచనలు అందిస్తున్నారు.
అధిష్టానం ప్రోత్సాహంతో మరింత దూకుడు పెంచేందుకు బండి సంజయ్ సిద్దమవుతుండటంతో తెలంగాణలో బిజెపి రాజకీయం ఆసక్తికరంగా మారింది.







