తెలంగాణ అధికార పార్టీ కి చెందిన రాజ్యసభ సభ్యులు పార్లమెంటు సభ్యులు లోక్ సభ రాజ్యసభ లో తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారంపై పెద్ద రచ్చే చేస్తున్నారు.తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అంతేకాదు ఢిల్లీకి వెళ్లి ఎంపీలు , మంత్రులు , ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు అంతా కలిసి ధర్నా చేపట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.తమ ఆందోళన కారణంగా దేశ వ్యాప్తంగా బీజీపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అనే ముద్ర పడుతుందని, అలాగే టీఆర్ఎస్ పార్టీకి జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు వస్తుందని ఎత్తుగడతో కేసీఆర్ ఉండగా, కేంద్రం సైతం టీఆర్ఎస్ ఎత్తుగడలను గట్టిగానే తిప్పికొడుతూ , ఆ పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తోంది.
ధాన్యం కొనుగోలు వ్యవహారంపై టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తుండడంతో తాము దాన్యం కొనుగోలు చేయమని ఎప్పుడూ చెప్పలేదని బీజీపీ కౌంటర్ ఇస్తోంది.దీంతో ఎంత కొంటారో ముందు చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన నిర్వహిస్తున్నారు.
దీనిపై కేంద్ర మంత్రి స్పందించి పార్లమెంటులోనే గట్టిగా సమాధానం ఇచ్చారు.కేంద్రం ఇచ్చిన టార్గెట్ ప్రకారం బియ్యం తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని, ఇచ్చిన మొత్తం తాము తీసుకుంటామని స్పష్టం చేశారు.
యాసంగి గురించి ఇంకా టార్గెట్లు ఫిక్స్ చేయలేదని, దానికి ఇంకా చాలా సమయం ఉందని కేంద్ర మంత్రి క్లారిటీ ఇవ్వడంతో టీఆర్ఎస్ ఇరుకున కనపడింది.కేంద్రం కౌంటర్ గట్టిగా ఉండడంతో టిఆర్ఎస్ డైలమాలో పడింది.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మరో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని బియ్యం నిల్వలను తనిఖీ చేసేందుకు కేంద్ర బృందం వెళ్లిందని, బియ్యం నిల్వల విషయంలో ఎన్నో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారని పార్లమెంటులో ప్రకటించారు.
ఇప్పటికే ఇదే విషయమే నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు .కర్ణాటక నుంచి తక్కువ రేటు కు బియ్యం కొనుగోలు చేసి ఎక్కువ మొత్తానికి ఎఫ్సీ ఐ కి అమ్ముతున్నారని ఇది పెద్ద స్కాం అంటూ ఎంపీ అరవింద్ ఘాటుగా విమర్శలు చేశారు.దీంతో టిఆర్ఎస్ వ్యవహారంపై అందరికీ అనుమానాలు తలెత్తాయి .దీనిపై ఏం చేయాలనే విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్ తో సమావేశం నిర్వహించి కేంద్రంపై ఏ విధంగా ఎదురుదాడి చేయాలనే విషయంపైనా ఆయన చర్చించారు. మొత్తంగా చూస్తే ధాన్యం కొనుగోలు వ్యవహారంలో బిజెపిని ఇరుకున పెట్టాలని చూసినా, చివరకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇరుకున పడాల్సిన పరిస్థితి నెలకొంది.