టైటానిక్ షిప్ ( Titanic ship )మునిగిపోవడానికి కొద్ది రోజుల ముందు ఓ ప్రయాణికుడు రాసిన ఉత్తరం ఇప్పుడు రికార్డు ధరకు అమ్ముడుపోయింది.యూకేలో జరిగిన వేలంలో ఈ లేఖకు ఏకంగా రూ.3.35 కోట్లు (300,000 పౌండ్లు) ధర పలికింది.బీబీసీ ఈ న్యూస్ రిపోర్ట్ చేసింది.ఆ దురదృష్టకర టైటానిక్ షిప్లో ప్రయాణించిన వారిలో ఒకరైన కల్నల్ ఆర్చిబాల్డ్ గ్రేసీ( Colonel Archibald Gracie ) రాసిన ఉత్తరం ఇది.విల్ట్షైర్లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ అనే వేలం సంస్థ ఆదివారం దీన్ని అమ్మకానికి పెట్టింది.మొదట దీని విలువ మహా అయితే రూ.67 లక్షలు (60,000 పౌండ్లు) ఉంటుందని అనుకున్నారు.కానీ, ఏకంగా అనుకున్నదానికంటే ఐదు రెట్లు ఎక్కువ ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.

సరిగ్గా ఏప్రిల్ 1912, 10న, అంటే కల్నల్ గ్రేసీ సౌతాంప్టన్లో టైటానిక్ ఎక్కిన రోజే ఈ ఉత్తరం రాశారు.దీన్ని “జరగబోయేది ముందే చెప్పినట్లుంది” అని అంటున్నారు.ఎందుకంటే, ఆ ఉత్తరంలో తన స్నేహితుడితో, “ఈ అద్భుతమైన షిప్ గురించి నా అభిప్రాయం చెప్పాలంటే, నా ప్రయాణం ముగిసేదాకా ఆగాల్సిందే” అని రాశారు.పాపం, ఆ మాట రాసిన ఐదు రోజులకే, టైటానిక్ ఓ మంచుకొండను ఢీకొని ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది.
ఆ సమయంలో టైటానిక్లో దాదాపు 2,200 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.వారిలో 1,500 మందికి పైగా ఆ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.
కల్నల్ గ్రేసీ ఫస్ట్-క్లాస్ ప్యాసెంజర్.తన క్యాబిన్ C51 నుంచి ఈ లెటర్ రాశారు.1912, ఏప్రిల్ 11న టైటానిక్ ఐర్లాండ్లోని క్వీన్స్టౌన్లో ఆగింది.అప్పుడే దీన్ని పోస్ట్ చేశారు.
ఆ తర్వాత ఏప్రిల్ 12న లండన్లో దీనిపై పోస్ట్ మార్క్ వేశారు.ఈ అమ్మకంతో ఇప్పుడు కొత్త రికార్డు నమోదైంది.
టైటానిక్లో ప్రయాణిస్తూ రాసిన ఓ ఉత్తరానికి ఇంత భారీ ధర పలకడం చరిత్రలో ఇదే తొలిసారి.

ఆ ఘోర ప్రమాదం నుంచి కల్నల్ గ్రేసీ ఎలా బయటపడ్డారనేది కూడా ఓ అద్భుతమైన కథ.ఆయన తర్వాత “ది ట్రూత్ ఎబౌట్ ది టైటానిక్” (The Truth About The Titanic) అనే పుస్తకం రాశారు.అందులో తన ఒళ్లు గగుర్పొడిచే అనుభవాన్ని వివరించారు.
గడ్డకట్టే చలిలో, సముద్రంలో తలకిందులైన లైఫ్బోట్పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నానని చెప్పారు.అయితే, ఆ లైఫ్బోట్పైకి ఎక్కిన చాలా మంది తర్వాత చలికి, నీరసానికి తట్టుకోలేక చనిపోయారని కూడా ఆయన బాధతో తెలిపారు.టైటానిక్ మునిగిపోయినప్పుడు గ్రేసీ ప్రాణాలతో బయటపడినా, ఆ ప్రమాదం ఆయన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.1912, డిసెంబర్ 2న ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.రెండు రోజుల తర్వాత, డయాబెటిస్ సంబంధిత సమస్యలతో కన్నుమూశారు.